దేశాన్ని అక్రమ వలసదారుల రాజధాని గా మారనీయమని, రోహింగ్యాలను మయన్మార్కు అప్పగిస్తామని కేంద్రం శుక్రవారం సుప్రీం కోర్టు ముందు స్పష్టం చేసింది. జమ్ము అధికారులు నిర్బంధించిన రోహింగ్యాలను వెంటనే విడుదల చేయాలని, వారిని మయన్మార్కు అప్పగించకుండా నిరోధించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్లో ఉంచుతున్నట్లు ప్రకటించింది.
అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. రోహింగ్యాలను మయన్మార్కు అప్పగించకూడదని, వారు కాందిశీకులని.. వారిని ఆ విధంగానే చూడాలని తెలిపారు. ఈ వాదనలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా ఖండించారు. రోహింగ్యాలు, కాందిశీకులు కాదని, అక్రమ వలసదారులని పేర్కొన్నారు. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్లో ఉంచబోమని చెప్పారు. మయన్మార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వారు తమ పౌరులేనని ఆ దేశం అంగీకరిస్తే, వెంటనే వారిని పంపిస్తామని స్పష్టం చేశారు. దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులకు రాజధానిగా మారనీయమని తెలిపారు.