వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోకపోతే గద్దెపై కొనసాగడం కష్టంగా మారుతుందని భారతీయ కిసాన్యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించారు. హరియాణాకు గుండెకాయలాంటి జీంద్ జిల్లాలోని ఖండేలా గ్రామంలో జరిగిన 'మహా పంచాయత్'లో ఆయన పాల్గొన్నారు. రైతుల బలం తెలిసేలా టేక్రాం ఖండేలా ఆధ్వర్యంలోని సర్వ జాతీయ ఖండేలా ఖాప్ దీన్ని నిర్వహించింది. రెండు దశాబ్దాల క్రితం ఉద్ధృతంగా రైతు ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఈ సంస్థకు ఉంది. ఈ సందర్భంగా టికాయిత్ ప్రసంగిస్తూ ఆందోళన కొనసాగితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుందని అన్నారు. ''ఇంతవరకు 'బిల్ వాపసీ' (చట్టాల రద్దు) గురించి మాట్లాడాం. ప్రభుత్వం శ్రద్ధగా వినాలి. యువత ఇప్పుడు 'గద్దీ వాపసీ' గురించి మాట్లాడితే ఏం చేస్తారు?'' అని ప్రశ్నించారు.
మేకులను లెక్కచేయం..
రైతులు రాకుండా చేసేందుకు రోడ్లపై మేకులు, మొనదేలిన ఇనుప చువ్వలు పాతడం, సిమెంట్ దిమ్మలను అడ్డంగా పెట్టడాన్ని టికాయత్ ఖండించారు. ''రాజుకు భయం కలిగితే కోటలోనే ఉండిపోతారు. నేను సైనికుడిని రోడ్లపై పాతిన మేకులపై పడుకుంటాను. నా మీద నుంచి నడుచుకుంటూ వెళ్లి వాటిని దాటండి'' అని అన్నారు. రైతుల పోరాటం మరింత ఉద్ధృతమవుతోందని.. ఖాప్ పంచాయతీల మద్దతు చూస్తుంటే విజయం సాధిస్తామన్న నమ్మకం కలుగుతోందన్నారు. శాంతియుతంగానే ఆందోళన చేద్దామని రైతులుక పిలుపునిచ్చారు.
తలపాగా గౌరవాన్ని కాపాడుతాం..
ఉద్యమంలో పంజాబ్ రైతుల పాత్రను టికాయిత్ ప్రశంసించారు. ''వారి సహాయం కోరుతున్నాం. హరియాణా, ఉత్తర్ప్రదేశ్లు వారికి తోడుగా ఉంటాయి. రైతు తలపాగా గౌరవాన్ని కాపాడుతాం'' అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. అయిదు డిమాండ్లను ఆమోదించాలంటూ ఈ సమావేశంలో తీర్మానించారు. హరియాణా, పంజాబ్ రైతు నేతలతో పాటు దాదాపు 50 ఖాప్ పంచాయత్ల నాయకులు హాజరయ్యారు.
రైతుల ప్రధాన డిమాండ్లు
- మూడు వ్యవసాయ చట్టాల రద్దు
- కనీస మద్దతు ధరకు చట్టబద్ధత
- స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు
- వ్యవసాయ రుణాల మాఫీ
- అరెస్టయిన రైతుల విడుదల
కూలిన వేదిక
టికాయత్ ప్రసంగిస్తున్న సమయంలో వేదిక కూలింది. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదు. ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కువ మంది చేరడంతో కుంగిపోయింది.
యువజన సంఘాల ప్రదర్శన..
రైతులకు మద్దతుగా దిల్లీలోని మండీ హౌస్ వద్ద వివిధ సంఘాలకు చెందిన యువకులు ప్రదర్శన జరిపారు. అయితే వారు జంతర్మంతర్ వరకు ఊరేగింపు జరపడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, డీఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, సీవైఎస్ఎస్, ఏఐపీడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు. జెండాలు, ప్లకార్డులు ప్రదర్శించారు.
అంతర్జాతీయ సరిహద్దుల్లా దిల్లీ శివార్లు..
రైతు ఆందోళనలు జరుగుతున్న దిల్లీ సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు, గస్తీ కొనసాగుతున్నాయి. వరుసగా అయిదో రోజు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని రద్దు చేశారు. ఇకపై దీన్ని అందుబాటులోకి తెస్తామని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు చెప్పారు.రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మెల వంటి అడ్డంకులను ఇంకా కొనసాగిస్తున్నారు. ఇవి దేశ అంతర్జాతీయ సరిహద్దుల్లా కనిపిస్తున్నాయని రైతు నాయకులు ఆరోపించారు.
ఆచూకీ తెలియని రైతుల గుర్తింపునకు కృషి: కేజ్రీవాల్
గణతంత్ర దినోత్సవం రోజు నుంచి కనిపించకుండా పోయిన రైతుల ఆచూకీని గుర్తించడానికి కృషి చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటికే జైలులో ఉన్న 115 మంది పేర్లను విడుదల చేశామని చెప్పారు. మరో 29 మంది రైతుల జాడ తెలియడం లేదంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఆయనకు వినతి పత్రం సమర్పించింది.
సామాజిక కార్యకర్త యోగితాకు నోటీసు
గణతంత్ర దినోత్సవం నాటి హింసపై ట్వీట్ చేసినందుకు సామాజిక కార్యకర్త యోగితా భయానాకు పోలీసులు నోటీసు ఇచ్చారు. విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ప్రతిష్టంభన తొలగిస్తేనే ప్రతిష్ఠ
'ఆ వ్యాఖ్యలు దేశ ఐక్యతను అడ్డుకోలేవు'
రైతులకు మద్దతుగా సీజేఐకి 141మంది లాయర్లు లేఖ