MLA Salary Increase : బంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. శాసనసభ్యుల వేతనాలను నెలకు 40వేల రూపాయలు పెంచినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు బంగాల్ శాసనసభలో ఓ ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రి జీతంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. చాలాకాలం నుంచి ఆమె జీతం తీసుకోవడం లేదు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బంగాల్ ఎమ్మెల్యేల జీతాలు తక్కువగా ఉన్నట్లు మమత చెప్పారు. అందువల్ల ఎమ్మెల్యేల జీతాలు రూ.40వేలు పెంచినట్లు తెలిపారు. రూ.40వేల పెంపు తర్వాత భత్యాలు, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా అదనపు చెల్లింపులతో కలిపి ఎమ్మెల్యేల మొత్తం జీతం ఎంతో మాత్రం వెల్లడించలేదు.
తాజా పెంపు నిర్ణయంతో బంగాల్ ఎమ్మెల్యేల జీతాలు ప్రస్తుతం ఉన్న రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెరగనున్నాయట. మంత్రుల జీతాలు రూ.10,900 నుంచి రూ.50,900కి పెరగనున్నాయట. కేబినెట్ మంత్రుల జీతాలు రూ.11 వేల నుంచి రూ.51 వేలకు పెరగనున్నాయట. అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు దీనికి అదనం. అవి కలుపుకొంటే ఎమ్మెల్యేలకు ఇకపై రూ.1.21 లక్షలు, మంత్రులకు రూ.1.50 లక్షలు చొప్పున లభిస్తాయని సమాచారం.
బంగాల్ రాష్ట్ర దినోత్సవంగా పొయిలా బైసాఖ్!
Bengal Day Poila Baisakh : బంగాల్ కొత్త సంవత్సరం పొయిలా బైసాఖ్ను ఆ రాష్ట్ర దినోత్సవంగా పాటించాలన్న తీర్మానాన్ని ఆమోదించింది బంగాల్ అసెంబ్లీ. అయితే ఈ తీర్మానానికి గవర్నర్ ఆమోదం లభించకపోయినా.. అదే రోజు బంగాల్ డేగా పాటిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు.
రూల్ 169 కింద పొయిలా భైసాఖ్ను బంగాల్ దినోత్సవంగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'బంగ్లార్ మాట్, బంగ్లార్ జోల్' రాష్ట్ర గీతంగా పాటించాలని మమత సర్కార్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 294 మంది సభ్యుల్లో 167 మంది.. ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. జూన్ 20వ తేదీని రాష్ట్ర దినోత్సవంగా పాటించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీకి చెందిన 62 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐఎస్ఎఫ్ ఏకైక ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు.
"రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'బంగ్లార్ మతి బంగ్లార్ జోల్'ను బంగాల్ రాష్ట్ర గీతంగా మార్చే ప్రతిపాదనకు నేను మద్దతు ఇస్తున్నాను. మరోవైపు, జూన్ 20న రాష్ట్ర దినోత్సవంగా జరుపుకోవాలని చేస్తున్న బీజేపీ డిమాండ్ను ప్రజలు సమర్థించరు" అని మమత అసెంబ్లీలో తెలిపారు. మరోవైపు, ఈ తీర్మానానికి బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్.. ఆమోదం లభించదని బీజేపీ నేత సువేందు అధికారి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై టీఎంసీ నేత బోస్ స్పందించారు. గవర్నర్ ఆ తీర్మానాన్ని ఆమోదించకపోయినా.. అదే రోజున బంగాల్ దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.