రాష్ట్ర ప్రజలందరూ కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, రాష్ట్రంలో ఒక్క కేసు కూడా లేకుండా చూడాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా కేసుల దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. మీ(ప్రజలు) సహకారంతో ఒడిశాలో ప్రస్తుతం కరోనా అదుపులో ఉందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మహమ్మారికి వ్యతిరేకంగా రాష్ట్రం చేస్తోన్న కృషిని ప్రశంసించిందని తెలిపారు.
ప్రస్తుతం రోజుకు 100 కేసులు నమోదవుతున్నాయన్న సీఎం.. కేసుల సంఖ్య జీరోకు చేరుకోవడమే లక్ష్యమని అన్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణలో లేకపోవడం వల్ల లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
దయ చేసి సహకరించండి.. లేకపోతే లాక్డౌనే
కరోనా పై పోరులో కర్ణాటక ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు. లేని పక్షంలోరాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రజలందరూ మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ విధంగా మహమ్మారిని అరికట్టవచ్చని తెలిపారు. మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేసిన సీఎం.. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఏర్పాడితే లాక్డౌన్ను అమలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా