ఉత్తరాఖండ్ చమోలీలో హిమనీనదం విస్ఫోటనం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే ఉత్తరాఖండ్లో మరో ఉపద్రవం పొంచి ఉంది. ఫిబ్రవరి 7న ఆకస్మిక వరదల అనంతరం.. రిషిగంగ నదీ ముఖద్వారం వద్ద శిథిలాలు కుప్పలుతెప్పలుగా చేరాయి. రిషిగంగ నదీ ముఖద్వారం వద్దకు చేరిన గఢ్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరేశ్ రాణా ఈ విషయాన్ని వెల్లడించారు. సంబంధిత దృశ్యాల్ని వీడియోలుగా చిత్రీకరించి వివరాలు పంచుకున్నారు.
పేరుకుపోయిన శిథిలాలు.. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా అక్కడ పెద్ద సరస్సులా ఏర్పడిందని రాణా వివరించారు. ఇది మరో విపత్తుకు దారి తీసే ప్రమాదం ఉన్నందున.. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆ శిథిలాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
సమాచారం ఉంది: సీఎం
జోషీమఠ్లోని రైనీ గ్రామం వద్ద ఏర్పడిన నీటి మడుగు గురించి సమాచారం ఉందని తెలిపారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్. అయితే.. ఆందోళన చెందాల్సిన పనిలేదని, అప్రమత్తంగా వ్యవహరిస్తే చాలని ఆయన స్పష్టం చేశారు. ఏం చేయాలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు సమీక్షిస్తున్నారని, వేరే నిపుణులను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఉత్తరాఖండ్ జలవిలయం ధాటికి ఇప్పటివరకు 36 మంది మరణించారు. మరో 170 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. దాదాపు 600 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారు.
ఇదీ చూడండి: