దిల్లీ సరిహదుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. సమస్యల పరిష్కారం కోసం చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభ వేదికగా పిలుపునిచ్చారు. అయితే.. చర్చలకు తాము సిద్ధమే అని ప్రకటిస్తున్నప్పటికీ.. డిమాండ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు కర్షకులు. అదే దృఢ సంకల్పంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కనీస మద్దతు ధర అంశంపై చర్చను కొందరు రైతులు తోసిపుచ్చారు. చట్టాలు రద్దు చేయాల్సిందేనని నొక్కి చెబుతున్నారు.
ప్రధాని మోదీ పిలుపు తర్వాత.. సింఘు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు, సంయుక్త కిసాన్ మోర్చా, జై కిసాన్ మోర్చా నేతలతో ఈటీవీ భారత్ మాట్లాడింది.
" ఉచిత ఆఫర్లు ప్రకటిస్తూ ప్రైవేటు టెలికాం సంస్థలు ముందుగా మొత్తం మార్కెట్ను ఆక్రమించుకుని బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు మూతపడేందుకు దారి తీసినట్లుగానే.. వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు సంస్థలు వస్తున్నాయి. ఆ సంస్థలు రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటే.. ఇక్కడా అదే జరుగుతుంది. ముందుగా ఆయా కంపెనీలు రైతులను తమ ఉచ్చులోకి లాగుతాయి. ఆ తర్వాత దోచుకుంటాయి. భాజపా తర్వాత కాంగ్రెస్ కూడా మా ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తోంది. రైతుల డిమాండ్లు ఆమోదించకుంటే.. ఈ ఉద్యమం 2024 వరకు కొనసాగుతుంది. "
- గుర్బక్ష్ సింగ్ బర్నాలా, జై కిసాన్ ఉద్యమ నేత
ఉద్యమం ప్రారంభించే ముందు ఆరు నెలలకు సరిపడా సరకులతో రైతులు సిద్ధమయ్యారని తెలిపారు బర్నాలా. ఇప్పుడు ప్రభుత్వ వైఖరిని చూశాకా.. దీర్ఘకాలం పాటు ఉద్యమం కొనసాగించేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పారు. ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా రైలు రోకో చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించినట్లు గుర్తు చేశారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కానీ, ఎలాంటి ఫలితం లభించలేదు. రాజ్యసభలో ప్రసంగం సందర్భంగా.. రైతులు ఆందోళనలు విరమించి, చర్చలకు రావాలని ప్రధాని మోదీ కోరారు. కొత్త చట్టాలను ఓసారి పరిశీలించాలన్నారు.
ఇదీ చూడండి: కేంద్రంపై రైతుల 'కిసాన్ మహా పంచాయత్' అస్త్రం