Cryptocurrency fraud case: క్రిప్టోకరెన్సీ పేరుతో సుమారు 900 మంది పెట్టుబడిదారులను మోసం చేసిన కే.నిషాద్ అనే వ్యాపారవేత్త ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం అటాచ్ చేసింది. కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త మదుపరుల నుంచి సుమారు రూ.1,200 కోట్ల మేర మోసగించినట్లు అధికారులు తెలిపారు. 'మోరిస్ కాయిన్' అనే పేరుతో క్రిప్టోకరెన్సీని ప్రారంభిస్తున్నట్లు నమ్మించి డిపాజిటర్ల నుంచి సొమ్మును కాజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేసిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిషాద్, అతని పేరుపై ఉన్న కంపెనీలు, బ్యాంక్ ఖాతాలను, బంధువుల స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ నేరం చేసి సంపాదించిన డబ్బుతో నిషాద్ సన్నిహితులు ఆస్తులు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. బిట్కాయిన్లు, ఇథీరియం, బీఎన్బీ, వైఎఫ్ఐ వంటి రూ.25 లక్షల విలువైన క్రిప్టోకరెన్సీని గుర్తించారు. వీటన్నింటినీ జప్తు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు రూ. 36.72కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు ఈడీ ఆధికారులు.
ఐటీ దాడుల్లో రూ.200 కోట్ల నల్లధనం పట్టివేత
కేరళలో ఆదాయపన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో రూ. 200 కోట్ల బయటపడ్డాయి. ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్వారీ నిర్వాహకులపై దాడి చేసిన ఐటీశాఖ అధికారులు.. లెక్కలో చూపని రూ. 200 కోట్ల ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. జనవరి 5 వ తేదీన గుర్తు తెలియని గ్రూపులపై సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్లోని 35 ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: తిరిగి విధుల్లోకి 'సింహా' మీసాల పోలీసు- సస్పెన్షన్ ఎత్తివేత