అది బిహార్లో ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో ధ్వంసమైన ప్రాథమిక పాఠశాల. కొన్నేళ్లుగా మూతపడిన ఆ విద్యాలయం ఇప్పుడు చిన్నారులతో కళకళలాడుతోంది. ఈ మార్పు వెనుక ఉన్నది స్వయానా ఓ నక్సలైట్ కోడలు.
2007లో జముయీ జిల్లాలోని చొర్మరాలో ఉన్న ఆ పాఠశాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన బాలేశ్వర్ కోడా అనే నక్సలైట్ కోడలు రంజూ దేవి. ఆమె స్వయంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది.

అంతేకాదు.. తన మామ బాలేశ్వర్ నక్సల్ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడంలోనూ ప్రత్యేక చొరవ చూపింది రంజూ దేవి. ఆమె మాట ప్రకారమే బాలేశ్వర్ తన అనుచరులతో కలసి ఈ ఏడాది జూన్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. విద్య ద్వారా పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నందుకు ఆనందంగా ఉందని రంజూ దేవి పేర్కొంది.
