అమెరికా మసాచుసెట్స్లోని బాబ్సన్ కాలేజీకి చెందిన విద్యార్థిని ఉత్తర్ప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. 19 ఏళ్ల సుదీక్షా భాటి బులంద్షహర్కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సెలవుల కోసం భారత్కు వచ్చిన సుదీక్ష ఆగస్టు 20న అమెరికా వెళ్లాల్సి ఉంది.
ఈవ్ టీజింగే కారణం..
బంధువులను కలవడానికి వెళుతుండగా కొంతమంది ఈవ్ టీజర్లు వెంబడించటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సుదీక్ష మామయ్య మనోజ్ వెల్లడించారు.
"రోడ్డుపై వెళుతుండగా కొంతమంది యువకులు సుదీక్ష పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను ఆకట్టుకోవడానికి తమ ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. హఠాత్తుగా వాళ్ల వాహనం సుదీక్ష స్కూటీని ఢీకొట్టింది. అదుపు తప్పిన సుదీక్ష కిందపడి అక్కడికక్కడే మరణించింది."
- మనోజ్ భాటి, సుదీక్ష బంధువు
అయితే... ఈ వ్యవహారంతో ఈవ్ టీజింగ్కు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి స్పష్టంచేశారు. బాధితురాలి కుటుంబం నుంచి అలాంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. సుదీక్ష మృతదేహాన్ని శవపరీక్షకు తరలించామని, దర్యాప్తు కొనసాగుతోందని బులంద్షహర్ ఎస్పీ అతుల్ శ్రీవాస్తవ తెలిపారు.
దోషుల్ని శిక్షించాలి: మాయావతి
సుదీక్ష మరణానికి కారణమైన దోషుల్ని శిక్షించాలని యూపీ మాజీ సీఎం మాయావతి డిమాండ్ చేశారు.
"సుదీక్ష భాటి.. మంచి విద్యార్థి. తన బంధువుల ఇంటికి వెళుతుండగా ఈవ్ టీజింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన చాలా విచారకరం. ఇలాగైతే మహిళల పురోగతి ఎలా సాధ్యమవుతుంది? దోషులపై యూపీ ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి."
- మాయావతి, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి
చదువుపై ఆసక్తితో..
సుదీక్ష తండ్రి జితేంద్ర భాటి చిన్న హోటల్ను నిర్వహిస్తున్నారు. జితేంద్రకు ఏడో సంతానమైన సుదీక్ష ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2009లో చదువు ఆపేయాల్సి వచ్చింది. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చేరి చదువుకుంది. అనంతరం జవహర్ నవోదయకు ఎంపికై 12వ తరగతి పూర్తి చేసింది.
2016 జులైలో పెన్సిల్వేనియా బెత్లెహేమ్లోని లేహి విశ్వవిద్యాలయంలోని లాకోకా ఇనిస్టిట్యూట్లో ప్రవేశం లభించింది. ఇనిస్టిట్యూట్కు ఎంపికైన 76 మంది విద్యార్థులలో సుదీక్ష ఒకరు. అనంతరం టోఫెల్ రాసి మసాచుసెట్స్లోని బాబ్సన్ కళాశాలకు అర్హత పొందింది.
ఇదీ చూడండి: తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులుంటాయ్: సుప్రీం