గుళ్లో పులిహోర పెడితేనే.. మెతుకు వదలకుండా లాగించేస్తాం.. కుదిరితే రెండు పొట్లాలు ఇంటికి పట్టుకెళతాం. ఇక ప్రసాదంగా మటన్ బిర్యానీ పెడితే...? ఇంకేముంది.. మాంసాహార ప్రియులకు పండగే..! ఆఁ.. తమిళనాడు మధురైలో మునియండి స్వామి ఆలయంలో అదే జరిగింది.. బిర్యానీ ప్రసాదాన్ని అందుకునేందుకు భారీ పాత్రలు పట్టుకుని పోటెత్తారు జనం.
బిర్యానీ మహాప్రసాదం..
అయితే ఈ బిర్యానీ ప్రసాదం ఆచారం ఇప్పటిది కాదు, దాదాపు 84 ఏళ్ల నుంచి ఇక్కడీ సంప్రదాయం కొనసాగుతోంది. వడక్కంపట్టి గ్రామంలో ఏటా 'మునియండీ ఆలయంలో బిర్యానీ' ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ పండుగలో భక్తులంతా పొట్టేళ్లు, కోళ్లు బలిచ్చి స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. ఆ తరువాత ఆలయంలోనే తయారు చేసే పసందైన మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలను ప్రసాదంగా స్వీకరిస్తారు.
బిర్యానీ తయారీకి కావల్సిన సామగ్రి కోసం భక్తులు ప్రత్యేకంగా విరాళాలు సమర్పిస్తారు. ఈ సారి ప్రసాదం తయారీకి 150 మేకలు, 300 కిలోల చికెన్, 1000 కిలోల బియ్యాన్ని ఉపయోగించారు. కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ బిర్యానీ ప్రసాదం అందిస్తున్నారు. అడిగినంత ప్రసాదాన్ని పెడతారు కాబట్టి.. భక్తులు అక్కడ తినేసి కాసింత ఇంటికి పట్టుకెళ్లేందుకు గిన్నెలతో క్యూ కట్టారు.
ఈ నెల 24న ప్రారంభమైన బిర్యానీ ప్రసాద పండుగ.. 26వ తేదీ వరకు కొనసాగుతుంది. మధురై నుంచి 25 కి.మీ దూరంలో ఉండే ఈ ఆలయానికి సర్వమత బిర్యానీ ప్రియులు ఆహ్వానితులే.