దేశంలోని పర్యావరణ చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)- 2020 ముసాయిదాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
"పర్యావరణ చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలి. ఇందులో భాగంగా ముందు ఈఐఏ-2020 ముసాయిదాను వెనక్కు తీసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్, మహమ్మారులపై పోరులో భారత్ను ముందంజలో ఉంచే జాతీయ అజెండాను రూపొందించడానికి విస్తృతమైన ప్రజా సంప్రదింపులు జరగాలి."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
హద్దులు దాటొద్దు..
కరోనా వైరస్ విజృంభణ ప్రపంచానికి ఒక హెచ్చరిక అన్న సోనియా.. ప్రజల ఆరోగ్యం, జీవనోపాధి దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. గొప్ప జీవవైవిధ్యం ఉన్న భారత్లో విస్తృతమైన అసమానతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
"హద్దులేని ఆర్థిక వృద్ధి వ్యామోహంలో పడి మన దేశం పర్యావరణం, ప్రజల హక్కులను త్యాగం చేసింది. అభివృద్ధి జరగాల్సిందే. కానీ ప్రతిదానికి పరిమితులు ఉంటాయి. ఆరేళ్లుగా పర్యావరణ పరిరక్షణ విధానాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది."
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
ప్రస్తుత ఈఐఏ ముసాయిదా ప్రకారం వచ్చే అనుమతులతో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించేందుకు కాలుష్యకారకులకు అవకాశం లభిస్తుందని ఆరోపించారు సోనియా. ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా పర్యవసానాలను లెక్కచేయకుండా 'సులభతర వాణిజ్యం' అంటూ గుడ్డిగా ముందుకు పోతున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు
ప్రమాదకారి..
ప్రకృతిని కాపాడితేనే అది మనల్ని రక్షిస్తుందని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ముసాయిదాకు సంబంధించి ఓ కథనాన్ని జతచేస్తూ ట్వీట్ చేశారు. ఈ ముసాయిదాకు ఆమోదం లభిస్తే అత్యంత ప్రమాదకారిగా మారుతుందని, దీర్ఘకాలంలో తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని కోరారు.
ముసాయిదా మాత్రమే..
వివిధ ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేసేందుకు పర్యావరణ చట్టంలోని ఈఐఏకు కొన్ని సవరణలు చేసిన ముసాయిదాను ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టింది కేంద్రం. దీనిపై ఇప్పటివరకు వేలాది సలహాలు, సూచనలు వచ్చాయి.
పలువర్గాల నుంచి వస్తోన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టత ఇచ్చారు. పూర్తి స్థాయి చట్టాన్ని రూపొందించకముందే వ్యతిరేకించటం అపరిపక్వ చర్య అని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పాలనలో పెద్ద పెద్ద నిర్ణయాలను ఎవరినీ సంప్రదించకుండానే తీసుకున్నారని ఆరోపించారు.
"ఈఐఏ- 2020 ముసాయిదా మాత్రమే. తుది చట్టాన్ని ఇంకా రూపొందించలేదు. మాకు ఇప్పటివరకు వేలాది సలహాలు, సూచనలు అందాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని తుది విధానాలను ప్రకటిస్తాం."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్రమంత్రి
ఇదీ చూడండి: 'సూటుబూటు స్నేహితుల కోసమే ఆ ముసాయిదా'