రఫేల్ ఒప్పందంపై తీర్పును సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయాన్ని వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానంలో ఈ అంశంపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని గతేడాది డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది కోర్టు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిన్హా, శౌరీ, భూషణ్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రఫేల్ ఒప్పంద వ్యవహారంపై కేంద్రం... కోర్టును తప్పుదోవ పట్టిస్తుందని అఫిడవిట్లో పేర్కొన్నారు పిటిషనర్లు. బదులుగా కేంద్రం కోర్టుకు ప్రమాణపత్రం సమర్పించింది.
రివ్యూ పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి సూచించగా.. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ నెల 4న ప్రమాణపత్రం సమర్పించారు.
నేడు అఫిడవిట్ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అందరి వాదనలు విన్న అనంతరం నిర్ణయం వాయిదా వేసింది.
ఒప్పందం వెనుక రహస్యాలు...
రఫేల్ పత్రాల మాయం దగ్గరనుంచి.. ఒప్పందంలో ఎన్నో కోణాలు దాగున్నాయని వాదనలు వినిపించారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్. ఈ అంశంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ విచారణ జరిపించాలని కోరారు.
ప్రధాని కార్యాలయం రఫేల్ వ్యవహారంపై సంప్రదింపులు జరిపిందని, ముగ్గురు సభ్యులతో కూడిన భారత ప్రతినిధుల బృందం ఇలా చేయడాన్ని తప్పుబట్టిందని గుర్తుచేశారు.
అవే వాదనలు...
కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని అభ్యర్థించారు. ప్రధాన పిటిషన్కు, రివ్యూ పిటిషన్కు పెద్ద మార్పులేమీ లేవని కోర్టుకు తెలిపారు. అవే వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు వేణుగోపాల్.
ఇంతకుముందు చెప్పినట్లే.. ఇది భారత్-ఫ్రాన్స్ రక్షణశాఖకు సంబంధించిన వ్యవహారమని, ఒప్పంద అంశాలు బహిర్గతం చేయలేమని కోర్టుకు తెలిపారు ఏజీ.
వీరందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది.
ఇదీ చూడండి: