కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆదివారం (మార్చి 22) దేశ వ్యాప్తంగా ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపుపై స్పందించారు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. దిల్లీ మొత్తం లాక్డౌన్ చేయటం కుదరని, అవసరమైతేనే కర్ఫ్యూ విధిస్తామని వెల్లడించారు.
కర్ఫ్యూ విధించడం ద్వారా పేదలపై ఆర్థిక భారం మరింత పడుతుందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం వచ్చే నెలలో 50 శాతం ఎక్కువ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 72 లక్షల మంది లబ్ధిదారులకు పెంచిన.. ఈ బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. రోడ్డు మీద జీవించే వారికి, యాచకులకు భోజన సదుపాయాన్ని కల్పించనున్నట్లు స్పష్టం చేశారు కేజ్రీవాల్.
వికలాంగులు, వితంతువులు, వయో వృద్ధులకు ఇచ్చే పింఛను రెట్టింపు చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ రెట్టింపు పింఛన్ను ఏప్రిల్ 7న అందజేస్తామని తెలిపిన కేజ్రీవాల్.. దీని ద్వారా మొత్తం 8.5 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. మతపరమైన, రాజకీయ సమావేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువగా గుమికూడదని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో దిల్లీలో 50 శాతం బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయని అన్నారు.
ఇదీ చూడండి: బాలీవుడ్ గాయనితో పార్లమెంట్కు కరోనా సెగ