సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు విపక్ష నేతలు పలు దఫాలు సమావేశమయ్యేందుకు నిర్ణయించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై చర్చించుకుని, ఆ తర్వాత ఎన్నికల సంఘాన్ని కలవడం నేటి అజెండా. ఈ భేటీకి ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి బయలుదేరాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇందుకు ఎలాంటి కారణం చెప్పలేదు.
మళ్లీ మొదలు...
సార్వత్రిక ఫలితాల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సులభంగా 300 సీట్లను సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కర్ణాటకలోనూ 28 సీట్లకు గాను భాజపా 21 వరకు గెలుచుకుంటుందని పేర్కొన్నాయి. ఈ అంచనాలతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి.
మే 23 తర్వాత సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నాయకులు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వీరిదేనని ఆరోపిస్తున్నారు.
"మంత్రిత్వశాఖలు, మంత్రి పదవులు అన్నీ అమ్మేశారు. ఈ విషయంపై సీఎం కుమారస్వామిని నిందించి ఏం లాభం? ఆయనను పనిచేయనిస్తే కదా? మొదటి రోజు నుంచే సిద్ధరామయ్య నేనే ముఖ్యమంత్రిని అవుతాను. నేనే సీఎం అంటున్నారు. మీరే వారి గడప దగ్గరకు వెళ్లి... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండని ఆహ్వానించారు. ఇప్పుడేమో నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నారు. వేణుగోపాల్, అహంకారం ఉన్న సిద్ధరామయ్య, ఘోరంగా విఫలమైన రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్ గుండురావ్ లాంటి వారిని నమ్ముకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి."
-రోషన్ బేగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే