అధ్యక్ష పదవిపై అనిశ్చితి.. పార్టీలో చీలికలు.. యువ నేతల తిరుగుబాటు.. ప్రభుత్వాల పతనం... ఇవీ గతకొన్నేళ్లుగా కాంగ్రెస్ను పట్టిపీడిస్తున్న సమస్యలు. దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్కు "అయోధ్య రామమందిర భూమిపూజ"తో ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది. రామాలయ నిర్మాణం వ్యవహారంలో పార్టీ వైఖరిపై విభేదాలు ఏర్పడటం కాంగ్రెస్ అగ్రనేతల్లో ఆందోళన కలిగిస్తోంది.
అసంతృప్తి.. ఆందోళన...
"అయోధ్య రామమందిర భూమిపూజ భరతజాతి ఐక్యతకు, సౌభ్రాతృత్వానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంద"ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. రామమందిరంపై కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవడం.. ఆ పార్టీలోని ఓ వర్గం ముస్లిం నేతలకు రుచించడం లేదు. ప్రియాంకతో పాటు రామమందిర నిర్మాణంపై అనేక మంది కాంగ్రెస్ సభ్యులపై వీరు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్టు వీరు పేర్కొన్నప్పటికీ.. మైనారిటీ వర్గాల మనోభావాలను కాంగ్రెస్ దృష్టిలో పెట్టుకోవాలని తేల్చి చెబుతున్నారు.
ఇదీ చూడండి:- 'రామమందిర వివాదం ముగింపు కాంగ్రెస్కు ఇష్టంలేదు'
అయోధ్య వ్యవహారంలో పార్టీ వైఖరిపై నిరాశ చెందినట్టు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎంపీ టీఎన్ ప్రతాపన్ లేఖ రాశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్లు రామమందిర నిర్మాణానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను ఈ లేఖలో ఆయన ప్రస్తావించారు. రామమందిర నిర్మాణానికి మద్దతివ్వడం.. తాత్కాలిక విజయాల కోసం తలవంచడమేనని ప్రతాపన్ అభిప్రాయపడ్డారు.
"పార్టీలో అనేకమందికి అనేక అభిప్రాయాలు ఉంటాయి. కమల్నాథ్, దిగ్విజయ్తో నేను ఏకీభవించను. ఇది నా అభిప్రాయం. సొంత అభిప్రాయాలను బయటపెట్టేందుకు పార్టీ అనుమతినిచ్చింది. కానీ తీర్పును పూర్తిగా అమలు చేయాలన్నదే మా కోరిక."
-- టీఎన్ ప్రతాపన్, కాంగ్రెస్ ఎంపీ.
'ఈటీవీ భారత్'తో మాట్లాడుతూ.. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించిందని.. అయితే అందులో కేవలం రామాలయ నిర్మాణం ఒక్కటే కాదని, మసీదు నిర్మాణం కూడా ఉందని గుర్తుచేశారు విదేశాంగశాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.
"మందిర నిర్మాణం ఒక్కటే తీర్పులో లేదు. మసీదు కూడా ఉంది. అందుకే తీర్పును స్వాగతించాం. ప్రస్తుతం మందిర నిర్మాణం జరుగుతోంది. కానీ మసీదు విషయాన్ని పక్కనపెట్టారు. తీర్పులో సగం పని అయినందుకు సంబరాలు చేసుకోలేం. కాంగ్రెస్ ఒక్కటే కాదు.. ప్రధానమంత్రి కూడా సంబరపడిపోకూడదు."
--- సల్మాన్ ఖుర్షీద్, విదేశాంగశాఖ మాజీ మంత్రి.
ఇదీ చూడండి:- రామాలయ భూమిపూజపై ఎవరేమన్నారంటే..
మరోవైపు రామాలయం నిర్మాణానికి కాంగ్రెస్సే కారణమని ఆ పార్టీలోని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. 1985లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హయాంలోనే మందిర తాళాలు తెరిచారని గుర్తుచేస్తున్నారు. కానీ భూమిపూజతో ఆ ఘనతను భాజపా-ఆర్ఎస్ఎస్లు దొంగిలిస్తున్నాయని మండిపడ్డారు.
అయితే ఈ వాదనలను సొంత పార్టీలోని కొందరు వ్యతిరేకిస్తున్నారు. రామమందిర తాళాలు తెరవాలన్నది కోర్టు తీర్పు అని.. అందుకని అది తమవల్లే జరిగిందని చెప్పుకోవడంలో అర్థంలేదని ఏఐసీసీ సెక్రటరీ, బిహార్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. అసలు భూమిపూజ వంటి వేడుకల్లో కాంగ్రెస్ తలదూర్చకూడదని ఎంపీ ప్రతాపన్ తన లేఖలో పేర్కొన్నారు.
టార్గెట్ మోదీ...
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు కాంగ్రెస్ సభ్యులు. భూమిపూజ నిర్వహించి.. మోదీ తన రాజ్యాంగ ప్రమాణాలను ఉల్లంఘించారని మండిపడ్డారు మాజీ ఎంపీ రషీద్ అల్వీ.
"లౌకికవాదమంటే.. ప్రజలు తమ సొంత నమ్మకాలతో రాజీపడటం కాదు. భారత్ లౌకికవాద దేశం. కావునా.. ప్రధాని భూమిపూజకు వెళ్లి ఉండాల్సింది కాదు. అదే అయోధ్యలో మసీదు నిర్మాణిస్తే మోదీ వెళతారా?"
-- రషీద్ అల్వీ, మాజీ ఎంపీ.
మరో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. అయోధ్యలో భూమిపూజ సందర్భంగా.. 130కోట్ల మంది భారతీయులకు మోదీ శుభాకాంక్షలు చెప్పినట్టు గుర్తుచేశారు శశిథరూర్. అయితే భారత జనాభా ప్రస్తుతం 138కోట్లు ఉంటుందన్న అంచనాల నడుమ.. మిగిలిన 8కోట్ల మందిని మోదీ పక్కనపెట్టడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇవి ముస్లిం సంఘాలనుద్దేశించి శశిథరూర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలనే చర్చ జరుగుతోంది.
అయితే.. రామమందిర భూమి సమయంలో పార్టీ నేతలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ సందేశాన్ని పంపించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ను లౌకికవాదం నుంచి ఎప్పటికీ తాను దూరం చేయనివ్వనని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం.
- నియామిక సింగ్
ఇవీ చూడండి:- 'అయోధ్య భూమిపూజను 16కోట్ల మంది వీక్షించారు'