ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ లేఖ రాశారు. కశ్మీర్ సహా ఇరుదేశాల మధ్య ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికై చర్చలు జరపేందుకు పాక్ సిద్ధమని ఇమ్రాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో పాక్ ప్రధానితో మోదీ సమావేశం ఉండదని అధికారులు తెలిపిన ఒక్క రోజులోనే ఇమ్రాన్ ఈ లేఖ రాయడం గమనార్హం.
ఇరుదేశాలు పేదరికంపై విజయం సాధించేందుకు చర్చలే ఏకైక మార్గమని ఇమ్రాన్ ఖాన్ తన లేఖలో పేర్కొన్నారు. భారత ప్రధానిగా రెండోసారి ఎన్నికైన మోదీకి ఇమ్రాన్ఖాన్ అభినందనలు తెలిపినట్లు సమాచారం.
ఈనెల 13,14 తేదీల్లో కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో ప్రధాని పాల్గొంటారు. ఈ సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పంగ్తో మోదీ విడిగా సమావేశమవుతారు. అయితే పాకిస్థాన్ ప్రధానితో భేటీ లేదని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు.
పాక్ విదేశాంగ మంత్రి లేఖ
విదేశాంగ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జైశంకర్కు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి మహమూద్ ఖురేషి శుక్రవారం లేఖ రాశారు. భారతదేశంతో అన్ని ప్రాధాన్య అంశాలను చర్చించడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఖురేషీ తెలిపారు. ఉపఖండంలో శాంతి స్థాపనకు పాక్ కట్టుబడి ఉందని లేఖలో పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయశంకర్కు ఖురేషీ శుభాకాంక్షలు తెలిపారు.
పుల్వామా దాడితో దెబ్బతిన్న సంబంధాలు
జమ్ముకశ్మీర్ పుల్వామాలో పాక్ ఆధారిత జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ ఫిబ్రవరిలో జరిపిన దాడిలో 40 మంది భారత సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అనంతరం బాలాకోట్లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానికదళం దాడి చేసింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి : 2 గంటల పాటు కోర్టులో నిల్చొన్న సాధ్వీ