వైరస్ బారినపడకుండా నివారణ చర్యల్లో భాగంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కషాయాలకు, విటమిన్-సీ ఉండే వంటి ఆహార పదార్థాల కోసం గూగుల్లో అధికశాతం మంది శోధించారని ఆ సంస్థ తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గూగుల్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. పానీపురి, ఔషధ కషాయాలను తయారు చేసుకోవడంలో 107 శాతం పెరుగుదల కనిపించింది. అయితే 5 నిమిషాల వంటకాల శోధనలో ఇది 56 శాతం వృద్ధి సాధించిందని గూగుల్ వెల్లడించింది.
దేశమంతా లాక్డౌన్లో అమల్లో ఉన్న కారణంగా దాదాపు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్న ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా.. తెలియని వాటి గురించి గూగుల్లో వెతకడం ఈ మధ్య సర్వసాధారణమైంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కషాయం లాంటి పదార్థాలను ఎక్కువశాతం తీసుకోవడంపై ఆసక్తి కనబరస్తున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా పిలుపు ఇవ్వడం వల్ల ఆయుర్వేద చిట్కాలను 90 శాతం మంది శోధించారని గూగుల్ ఇండియా వెల్లడించింది.
ఇంకా ఏమేం శోధించారంటే..
- 5 నిమిషాల్లో సిద్ధమయ్యే కషాయాల తయారీని శోధించే వారి సంఖ్య 20 శాతం పెరిగింది.
- విటమిన్-సీ పదార్థాల కోసం శోధించే వారి సంఖ్య 150 శాతానికి పెరిగింది. ఇక ఆయుర్వేద జూస్ 'గిలోయ్' లక్షణాలనూ వెతికే వారి సంఖ్య 380 శాతానికి చేరింది. ఇలాంటి ఔషధ గుణాలున్న కషాయాల కోసం 90 శాతం మంది వెతికారు.
- ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన వీక్షకుల సంఖ్య 180 శాతం పెరిగింది.
- ఈ ఏడాది మార్చి నుంచి గూగుల్లో 'నియర్ మీ'ని వెతకడం ఆసక్తికర విషయం. ఇందులో వైద్య ఆరోగ్య సంబంధమైనవి 58 శాతం కాగా.. కిరాణ సరకులు- 550 శాతం, రేషన్ దుకాణాల కోసం వెతికిన వారి సంఖ్య 300 శాతానికి పైగా పెరిగింది.
అయితే.. దేశంలో ప్రజల అవసరాలు ఎలా ఉన్నాయనే దానిపై ఈ నివేదిక ముందస్తు అవగాహన కల్పిస్తోందని గూగుల్ ఇండియా మార్కెటింగ్ సీనియర్ డైరెక్టర్ సాప్నా ఛాదా తెలిపారు.
'ఇందులో కొన్ని మార్పులు తాత్కాలికమే. వైరస్ వ్యాప్తి ముగిశాక కూడా వారిలో ఇలాంటి గణనీయమైన మార్పులను పరిశీలించవచ్చు. ఈ పరిణామాల ద్వారా ప్రజల్లో వేగవంతమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో విక్రయదారులకు, వినియోగదారులకు మా వంతు సహకారం అందిస్తాం.'
- సాప్నా ఛాదా, సీనియర్ డైరెక్టర్- గూగుల్ ఇండియా మార్కెటింగ్
- 'జిమ్ ఎట్ హోమ్'ను వెతికే వారు 93 శాతానికి పైగా పెరిగారు.
- ఇంటర్నెట్ కోర్సుకు గిరాకీ పెరగడం వల్ల.. 'ఆన్లైన్ లెర్నింగ్'ను 85 శాతం, 'ఎట్ హోమ్ లెర్నింగ్'ను 78 శాతం మంది ఎంక్వైరీ చేశారు.
- క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, మొబైల్ పేమెంట్స్కు కూడా జనాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 'క్యూఆర్ కోడ్ పేమెంట్స్' శోధనలు 66 శాతం పెరగ్గా, 'హౌ టూ ఛేంజ్ యూపీఐ పిన్'ను వెతికిన వారి సంఖ్య 200 శాతానికి వృద్ధి చెందింది.
- ఆన్లైన్ వైద్యుల్ని సంప్రదించడం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చికిత్సలు చేయించుకోవడం వంటి సాంకేతిక పరిజ్ఞానాన్నీ బాగా ఉపయోగిస్తున్నారు.
- మొత్తంగా ఈ ఏడాది ఆన్లైన్ ప్లాట్ఫామ్ల కోసం ఆసక్తిచూపే వారిసంఖ్య 40 శాతం నుంచి 120 శాతం వరకు పెరిగింది. ఇందుకోసం ఒక్కొక్కరు వారానికి సుమారు నాలుగు గంటల సమయాన్ని కేటాయిస్తున్నట్లు గూగుల్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి: కరోనా కాలంలో చేతులకు పూతలే రక్షణ!