తమిళనాడు మదురైలోని తియాగరాజర్ పాఠశాల.. విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు సరికొత్త ఆఫర్ పెట్టింది. తమ స్కూల్లో చేరే 6వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ఫోన్లు ఇస్తామని తెలిపింది. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు వీటిని అందించనున్నట్లు పేర్కొంది యాజమాన్యం.
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభించిన యాజమాన్యాలు.. విద్యార్థులకు వర్చువల్గానే తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లకూ అంగీకారం తెలిపింది. ఫలితంగా కొత్త విద్యార్థుల కోసం మొబైల్ ఫోన్ల ఆఫర్ పెట్టింది తియాగరాజర్ స్కూల్. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు పాఠశాల కావడం విశేషం.
ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో విద్యార్థులకు మొబైల్ ఫోన్లు అందించనున్నట్లు తెలిపారు తియాగరాజర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామనాథన్. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే తమిళ భాషను ప్రోత్సహించేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు.
"జూన్ నుంచి వాట్సాప్ ద్వారా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాం. చాలా మంది విద్యార్థులు హాజరుకాలేకపోతున్నారు. వారికి మొబైల్ కొనే స్థోమత లేదని తెలిసింది. అందుకే ఉపాధ్యాయులందరం కలిసి 6వ తరగతిలో చేరే విద్యార్థులకు ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దీని ద్వాారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు."
-రామనాథన్, ప్రాధానోపాధ్యాయుడు.
ఇప్పటికే ఈ పాఠశాలలో రూపాయి ఖర్చు లేకుండా విద్యను అందిస్తుండగా.. ఫోన్ సేవతో విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుందని స్కూల్ యాజమాన్యం భావిస్తోంది.