తృణమూల్ కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. పశ్చిమ బంగాల్లో అల్లర్లు సృష్టించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి గుండాలను దింపుతూ.. భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని ఆరోపించింది తృణమూల్. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో మత ఘర్షణలు వ్యాప్తి చేస్తోందని దుయ్యబట్టింది.
" బంగాల్లో భాజపా ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని లోక్సభ ఎన్నికల నుంచి చెబుతున్నాం. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బిహార్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల నుంచి గుండాలను దింపుతున్నారు. భాట్పాడాలో చెలరేగుతున్న అల్లర్లతో బంగాలీలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాల్సి వస్తోంది. మొత్తం రాష్ట్రాన్ని భాట్పాడాగా మారటాన్ని మేము అనుమతించం."
- ఫిర్హాద్ హకీమ్, తృణమూల్ సీనియర్ నాయకుడు
ఖండించిన భాజపా..
తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్. రాష్ట్రాన్ని పాకిస్థాన్లా మార్చేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోందని ఎదురుదాడి చేశారు. భాట్పాడాలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట్ర పాలనా యంత్రాంగం ఏ మాత్రం సుముఖంగా లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని ఆరోపించారు.
ఇదీ చూడండి: రాజస్థాన్: గుడారాలు కూలి 15 మంది మృతి