ఏడాదిలో మూడు నెలలు మాత్రమే తెరిచే తపాలా కార్యాలయం అది. అక్కడ ఉపయోగించే తపాలా బిళ్లల్లో స్వామి అయ్యప్ప చిత్రం మాత్రమే ఉంటుంది. అదే కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప సన్నిధానం పోస్టాఫీస్.
ఏకైక పోస్ట్ ఆఫీస్
1960లో శబరిమలలోని మాలికప్పురం ఆలయం సమీపంలో ఈ తపాలా కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఇది సబ్పోస్ట్ ఆఫీస్గా ఉంది. మండల-మకరవిలక్కు తీర్థయాత్ర జరిగే 66 రోజులు, విషు పండుగ జరిగే పది రోజులు మాత్రమే ఇది పనిచేస్తుంది. దేశంలో ఇలా కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేసే ఏకైక తపాలా కార్యాలయం ఇదే.
అయ్యప్ప ముద్రతో..
ఈ తపాలా కార్యాలయంలో 1975 నుంచి అయ్యప్పస్వామి చిత్రంతో తపాలా బిళ్లలను ముద్రిస్తున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్.. వివాహ, నూతన గృహప్రవేశ ఆహ్వానాలు, ధన్యవాద లేఖలు సహా భక్తుల ఆనంద, విషాద లేఖలు అన్నింటినీ స్వీకరిస్తుంది. అలాగే ఈ కార్యాలయానికి అయ్యప్ప పేరిట మనియార్డర్లు వస్తుంటాయి. వీటన్నింటినీ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి కార్యాలయానికి అందజేస్తారు.
మొబైల్ రీఛార్జ్
ఈ తపాలా కార్యాలయంలో లేఖలు, మనియార్డర్లతో పాటు ఉద్యోగుల జీతాల పంపిణీ, మొబైల్ రీఛార్జ్ సేవలు కూడా అందిస్తారు. అలాగే ప్రజలు కోరుకున్న విధంగా వారి సొంత చిత్రంతో తపాలా బిళ్లను కూడా అందిస్తారు. వీటిలో శబరిమల చిత్రం కూడా ఉంటుంది.
ఈ కార్యాలయంలో పోస్ట్మాస్టర్, ఇద్దరు పోస్ట్మెన్, ముగ్గురు గ్రూప్-డీ ఉద్యోగులు సహా మరో ఆరుగురు సిబ్బంది ఉంటారు.
ఇదీ చూడండి: 'ఆ నిర్ణయం నాది కాదు.. సర్కారుకు మా మద్దతు లేదు '