బంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపిన అంపన్ తుపానును కేంద్రప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సమావేశమైన 22 పార్టీల నేతలు... ఈమేరకు తీర్మానం చేశారు.
శుక్రవారం వీడియో కాన్ఫరన్స్ ద్వారా అన్నీ పార్టీలతో మాట్లాడిన సోనియా.. అంపన్ వల్ల ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై విపక్ష నేతలతో చర్చించారు. కరోనా సంక్షోభం, కేంద్రం చేపడుతున్న చర్యలపైనా సమాలోచనలు జరిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉపశమనం, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి అన్ని పార్టీలు సూచించాయి.
"అంపన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగాల్, ఒడిశాకు.. విపక్షాలుగా మా మద్దతు, సానుభూతి తెలియజేస్తున్నాం. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టేలా ఈ విపత్తు రావడం దురదృష్టకరం. కేంద్రం వెంటనే అంపన్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ప్రభావిత రాష్ట్రాలకు సత్వరమే సాయం అందించాలి".
-- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, వామపక్షాలు సహా మిగతా పార్టీల నాయకులు హాజరయ్యారు.