విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాతావరణం దెబ్బతీయడానికి వామపక్ష విద్యార్థి సంఘాల కోటరీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు పలు విశ్వవిద్యాలయాల వీసీలు సహా 200 మందికి పైగా విద్యావేత్తలు. సమస్యను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విద్యా సంస్థల్లో వామపక్ష అరాచకానికి వ్యతిరేక ప్రకటన పేరుతో రాసిన ఈ లేఖను ప్రధానికి పంపించారు.
"విద్యార్థి రాజకీయాల పేరుతో బెదిరింపులకు పాల్పడటాన్ని ఇటీవల మేం గమనించాం. దీని వెనక వామపక్ష ఎజెండా ఉంది. జేఎన్యూ, జామియా, అలీగఢ్, జాదవ్పుర్ వర్సిటీల్లో ఇటీవల జరిగిన పరిణామాలు.. వర్సిటీల్లో క్షీణిస్తున్న విద్యావాతావరణానికి సూచిక. దీని వెనక వామపక్షీయుల రహస్య ఎజెండా దాగుంది."
-ప్రధానికి రాసిన లేఖలోని భాగం
విద్యార్థి రాజకీయాల పేరిట వామపక్ష కార్యకర్తలు విఘాతకరమైన ఎజెండాను విద్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు ఆరోపించారు. బంద్లు, ధర్నాలు, ఆచరణ సాధ్యం కాని డిమాండ్లను వామపక్ష వాదులు చేస్తున్నారని లేఖలో విద్యావేత్తలు ఉటంకించారు. వారికి వ్యతిరేక గళమెత్తితే వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం, బహిరంగంగా విమర్శలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వామపక్షీయుల తీరుతో బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటీ హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు.
ఇదీ చూడండి: రాజస్థాన్లో పండగ కోసం ముస్తాబైన 'ఒంటెలు'