తమిళనాడులో ఓ 19 ఏళ్ల యువతిపై పోక్సో చట్టం(pocso act) కింద కేసు నమోదైంది. మైనర్ బాలుడితో వివాహం చేసుకున్నందుకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు.
కథేంటంటే?
తమిళనాడు పొల్లాచికి చెందిన 19 ఏళ్ల యువతి ఓ పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తోంది. అదే ప్రాంతంలో 17 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి పెట్రోల్ స్టేషన్కు వెళ్లడం అలవాటు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ.. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది.
అయితే, ఆ యువతికి ఇంట్లో పెద్దలు పెళ్లికి ఏర్పాటు చేశారు. ఈ సమయంలో యువకుడు ఓ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరాడు. దీంతో యువతి ఆస్పత్రికి వెళ్లి పెళ్లి సంబంధాల గురించి యువకుడికి చెప్పింది. 'పెద్దలు నిశ్చయించిన పెళ్లికి ముందే మనం వివాహం చేసుకుందాం' అని యువకుడిని ఒప్పించింది. వెంటనే ఓ గుడికి తీసుకెళ్లి వివాహం చేసుకుంది.
తర్వాత ఇంటికి వచ్చిన యువకుడిని తల్లిదండ్రులు నిలదీయగా.. పెళ్లి గురించి చెప్పేశాడు. 19 ఏళ్ల యువతితో వివాహం చేసుకున్నట్లు తన అమ్మానాన్నలకు వివరించాడు. ఈ వ్యవహారం అంతా విని షాక్కు గురైన యువకుడి తల్లిదండ్రులు.. యువతిపై పొల్లాచి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బలవంతంగా...
విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయం తెలిసింది. యువకుడిని బలవంతం చేసి పెళ్లికి ఒప్పించినట్లు తేలింది. దీంతో ఈ విషయంపై దృష్టిసారించిన కోయంబత్తూరు జిల్లా ఎస్పీ.. యువతిని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం యువతిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం ప్రకారం అభియోగాలు మోపారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం నిందితురాలికి రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి: కొడుకును చిత్రహింసలు పెట్టి.. సెల్ఫీ వీడియో తీసి...