Food on Papers: సీఎం సభకు వచ్చిన కార్యకర్తల భోజన ఏర్పాట్లు అస్తవ్యస్తం.. అట్టముక్కలలో భోజనం
YSRCP Activists Eat Food on Papers in CM Tour : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం రైతు దినోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులకు బీమా విడుదల చేశారు. సభ ముగిసిన తర్వాత అనంతపురం, కంబదూరు వైపు వెళ్లే కార్యకర్తలకు సభా ప్రాంగణం పక్కనే ఉన్న ఓ పొలంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, భోజనాలైతే తెచ్చారు కానీ, విస్తరాకులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ భోజన ఏర్పాట్లు అస్తవ్యస్తంగా మారాయి.
సీఎం సభ ముగిసిన తరువాత మధ్యాహ్నం ఆకలితో ఉన్న కార్యకర్తలు భోజనం కోసం ఎదురు చూశారు. కానీ తినేందుకు విస్తరాకులు లేకపోయినా అట్ట ముక్కలు చించుకుని వాటిలో అన్నం తిన్నారు. వడ్డించే వారు లేక కార్యకర్తలే అన్నాన్ని తోడుకున్నారు. మరి కొంత మంది కార్యకర్తలు సభకు తెచ్చిన ప్లకార్డులను విస్తరాకులగా, కంచాలుగా ఉపయోగించారు. వైసీపీ నేతల భోజన ఏర్పాట్లపై సభకు వచ్చిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తరాకులు కొనటానికి డబ్బులు లేవని.. అందుబాటులో ఉన్న అట్టముక్కలను చించుకుని అన్నం పెట్టించుకోవాలంటూ వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. అన్నం పెట్టించుకుని తిని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దని ఆ కార్యకర్త ప్రజలకు సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్గా మారింది.