'ఇన్నాళ్లకు ఊరు గుర్తొచ్చిందా?' గ్రామ సమస్యలపై యువత నిలదీత - ఎమ్మెల్యేకు చేదు అనుభవం - విజయనగరం రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 11:46 AM IST
Young People Questioning MLA In Village Problems: విజయనగరం జిల్లాలో గ్రామ సమస్యలపై యువత అధికారులను నిలదీశారు. నాలుగున్నరేళ్ల తరువాత చీడిపాలెం గుర్తొచ్చిందా..? అసలు ఈ గ్రామం ఉందని మీకు తెలుసా..? అంటూ శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును ఆ గ్రామ యువత నిలదీసింది. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోట మండలం ముసిడిపల్లి పంచాయతీ శివారు చీడిపాలెం గ్రామానికి వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కారును యువకులు అడ్డుకొని నాలుగున్నరేళ్లలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, మంచినీటి సమస్యలు ఉన్నా పట్టించుకోలేదని, అంబులెన్స్ కూడా రావడంలేదని, యువతకు జాబ్ క్యాలెండరు ఎందుకు ప్రకటించలేదని ఆక్షేపించారు. ఎన్ని సార్లు సమస్యలు చెప్పినా స్పందన లేదన్నారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న 75వేల కుటుంబాలను కలుసుకోవడానికి రెండేళ్లు పట్టిందని, సమస్య ఉంటే చెప్పాలని ఎమ్మెల్యే శ్రీనివాసరావు కోరారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామ నాయకులు వారికి సర్ధిచెప్పడంతో కాసేపటికి పరిస్థితి సద్దుమణిగింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ముందుగానే వీధుల్లోకి వెళ్లి ప్రజలకు ఎమ్మెల్యే తన పేరు ఏమిటని అడిగితే కడుబండి శ్రీనివాసరావు అని చెప్పాలని ప్రజలను సంసిద్ధం చేశారు.