By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 3:00 PM IST
|Updated : Jan 5, 2024, 3:39 PM IST
సర్పంచ్ లారీ దహనం - పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై గ్రామస్థుల దాడి 'పెనుగంచిప్రోలులో ఉద్రిక్తత'
Sarpanch Lorry Fired: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానంతో బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతడిని కారులో ఎక్కించుకొని వెళ్తుండగా గ్రామస్థులు అడ్డగించారు. పోలీసులు వినియోగించిన ప్రైవేటు కారును స్థానికులు ధ్వంసం చేసి సీఐ, ఎస్సై సమక్షంలోనే త్రినాథ్పై దాడికి పాల్పడ్డారు.
Tension atmosphere in Anigandlapaadu: పంచాయతీ కార్యాలయం పక్కన నిలిపి ఉంచిన లారీలో ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే సర్పంచ్ దంపతులు జ్యోతి, బ్రహ్మంకు సమాచారం ఇచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆలస్యం కావటంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన బోశెట్టి త్రినాథ్, మరో ఇద్దరు కలిసి తన లారీని దగ్ధం చేశారని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆ ముగ్గురు గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని, గతంలో వీరికి చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని సర్పంచ్ దంపతులు స్పష్టం చేశారు. ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.