By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 4:39 PM IST
కక్ష సాధింపులో భాగంగానే సంగం డెయిరీపై అక్రమ కేసులు: ధూళిపాళ్ల నరేంద్ర
Sangam Dairy Chairman Dhulipalla Narendra Comments: సంగం డెయిరీపై కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపాలు చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. డెయిరీ ముందు గొడవ జరగకపోయినా.. తప్పుడు కేసులు పెట్టారని ధూళిపాళ్ల ఆరోపించారు.
Sangam Dairy Issue: గొడవ చేయడానికి తూర్పు గోదావరి జిల్లా నుంచి రైతులు వస్తారని సాక్షి ఛానల్కి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. పాలు పోయాలని అడగడానికి వెళ్లిన ముగ్గురు ఉద్యోగులను నిర్బంధించారని అన్నారు. సంగం డెయిరీ వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోదన్న ధూళిపాళ్ల.. పాల ధరలు వ్యక్తుల ఇష్టానుసారం ఉండదని తెలిపారు. సంగం డెయిరీపై ఉద్ధేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని.. కిరాయి మనుషులతో డెయిరీ ముందు గొడవ చేయించారని ధూళిపాళ్ల మండిపడ్డారు.
గొడవకు వచ్చిన వారిలో ఒక్కరు కూడా పాడి రైతు లేరన్న ధూళిపాళ్ల.. ప్రభుత్వం సంగం డెయిరీపై కుట్రకు తెర తీసిందని ఆరోపించారు. సంగం డెయిరీపై దాడి చేయాలనే కొందరు వచ్చారని.. విధ్వంసానికి వచ్చిన వారిపై కాకుండా తమపై కేసులు పెట్టారని అన్నారు. పక్కా పథకం ప్రకారమే విధ్వంసం చేసేందుకు వచ్చారని.. పోలీసులు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఒత్తిడి మేరకే తనను ముద్దాయిగా చేర్చారన్న ధూళిపాళ్ల.. ఘటనాస్థలంలో తాను లేనని తెలిపారు.