పంచాయతీ కార్యాలయంలో దస్త్రాల దహనం - జూనియర్ అసిస్టెంట్ అరెస్ట్ - బాపట్ల సమాచారం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-11-2023/640-480-20139229-thumbnail-16x9-junior-assistant.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 12:32 PM IST
Junior assistant arrested for burning records : బాపట్ల జిల్లా ఇంకొల్లు పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన దస్త్రాల దహన ఘటనపై, జూనియర్ అసిస్టెంట్ చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి చైతన్య పెట్రోలు బాటిల్తో వెళ్లి కార్యదర్శి గదిలోకి నిప్పు పెట్టాడు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు కేకలు వేయగా.. స్థానికులు వచ్చి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. మంగళవారం ఈవోఆర్డీ సమక్షంలో కాలిన దస్త్రాల వివరాలను సిబ్బందితో సేకరించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఎంపీడీవో రాజ్యలక్ష్మి సమక్షంలో పంచనామా నిర్వహించారు. కాలిన వాటిలో బిల్లులు, కోర్టు దస్త్రాలు, గృహాల ప్లాన్లు, ఆక్రమణల దస్త్రాలు ఉన్నట్లు గుర్తించారు.
పంచాయతీలో పెద్దఎత్తున నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 15 నెలల వ్యవధిలో నలుగురు కార్యదర్శులను మార్చారు. ఓ కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ చేసి కోటి రుపాయలు పైగా నిధులు కాజేశారని ఆరోపణలున్నాయి. రాజకీయ కారణాలతో కార్యదర్శి గదిలోని దస్త్రాలు దహనం చేయడం చర్చనీయాంశమైంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే మరిన్ని అవకతవకలు బయటపడుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఘటనపై ఈవోఆర్డీ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. చైతన్య తానే నేరం చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం.