Damage Roads in Nellore: నెల్లూరులో పాడైపోయిన రోడ్లు..నాలుగేళ్లగా ఒక్క రోడ్డునీ బాగుచేయని ప్రభుత్వం
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2023/640-480-18887087-597-18887087-1688180677412.jpg)
Damage Road in Nellore : నెల్లూరులో ప్రతిపక్ష నేతలకు సవాళ్లు విసిరుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అస్తవ్యస్తంగా మారిన రోడ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. ఎటు చూసినా గుంతలు, రాళ్లు పైకి తేలిన పరిస్థితుల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. ప్రజా ప్రతినిధులెవరూ రోడ్ల వైపు కన్నెత్తయినా చూడడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. సుమారు 9 లక్షల మంది జీవనం సాగిస్తున్న ఈ నగరంలో నాలుగేళ్లగా వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క రోడ్డునీ బాగుచేయలేదు. రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శివారు రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గుంతల దారుల్లో పగటి పూట అవస్థలు పడుతున్నామంటున్న వాహనదారులు.. రాత్రి సమయంలో నరకం కనపడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లపై రాళ్లు తేలి ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లను ప్రజలు వైఎస్సార్సీపీకి కట్టబెట్టారు. వారిలో ఏ ఒక్కరూ తమ గోడును ఆలకించడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే ఈ గుంతల రోడ్లపై ఎలా ప్రయాణించాలో తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు తమ గోడును ఆలకించి రోడ్లు వేయాలని ప్రజలు కోరుతున్నారు.