'సొంత నియోజకవర్గానికే అన్యాయం చేసిన జగన్' - డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన - డీఎస్సీ అభ్యర్థుల ధర్నా
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2024, 5:32 PM IST
DSC Candidates Protest in YSR Statue in Tadepalli: డీఎస్సీ-98 ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం వారికే అన్యాయం చేశారని అర్హత సాధించిన అభ్యర్థులు ఆరోపించారు. డీఎస్సీ-98 పోస్టులకు అర్హత సాధించిన సుమారు 50 మంది అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు వారిని లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్ విగ్రహం వద్ద అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు.
డీఎస్సీ-98 పోస్టుల భర్తీలో ఇంకా 2,200 మందికి పైగా ఉద్యోగాలు రావాల్సి ఉందని అభ్యర్థులు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా రెండు సంవత్సరాల నుంచి మంత్రులు, అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కోడ్ రాకముందే తమ సమస్యను పరిష్కరించాలని ఆందోళనలో పేర్కొన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.