రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీ పాలనే: సీపీఐ నేత కె. రామకృష్ణ - CPI and CPM state secretaries criticized Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 7:11 PM IST
CPI State Secretary Criticized Jagan : రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీ పాలనే జరుగుతుందని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో పాత కంపెనీ పేరు మీద పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుందని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ సోదరుడు అనిల్ చెన్నైలో ఉంటూ..ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాడని విమర్శించారు. హైకోర్టు తీర్పులో అన్నీ విషయాలు వివరంగా చెప్పినా.. రాజధాని తరలింపుపై ప్రభుత్వం జీవోలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. పేదలు, పెత్తందారులు అని మాట్లాడుతున్న మీరు.. ప్యాలస్లలో ఉన్న టాయిలెట్లకు లక్షలు రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. వందల కోట్ల ప్రజాధనం ప్యాలస్లకు ఖర్చు పెట్టి.. కోర్టులను ధిక్కరించి.. విశాఖ వెళ్లి పాలన చేస్తానని అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా కట్టడి చేయడానికే మెమోలు ఇస్తున్నారన్నారు. అకారణంగా ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వడంపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
CPM State Secretary Criticized Narendra Modi : అదేవిధంగా.. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని తిరుపతికి వస్తున్నారని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల సాక్షిగా ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ భాజపాను ఏనాడైనా ప్రశ్నించారా ? అన్నారు. బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించిన పవన్.. ఇప్పుడు ఎందుకు బీజేపీకి వంత పాడుతున్నారన్నారు. పవన్ పాచిపోయిన లడ్డూలు తెచ్చి తిరుపతి వెంకన్న స్వామి ముందు పెట్టి క్షమాపణ చెప్పాలన్నారు.