Cash Theft in Mangalagiri RTC Depot: మంగళగిరి ఆర్టీసీ డిపోలో డబ్బు మాయం.. కేసు నమోదు చేయని పోలీసులు.. చిరుద్యోగి బలి - మంగళగిరి RTC డిపో
🎬 Watch Now: Feature Video
Cash Theft in Mangalagiri RTC Depot: గుంటూరు జిల్లా మంగళగిరి RTC డిపోలో నగదు మాయమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 14న డిపోలో 6.30 లక్షల రూపాయల నగదు మాయమైంది. అయితే నగదు పోవడంపై డిపో క్లర్క్ వరప్రసాద్ను బాధ్యుడుని చేస్తూ.. ఆయన నుంచి మెుత్తం నగదును RTC ఉన్నతాధికారులు వసూలు చేశారు. వరప్రసాద్ ఇటీవలే కుమార్తె వివాహం కోసం PF డబ్బును డ్రా చేయగా.. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, ఉద్యోగం పోతుందనే భయంతో ఆ డబ్బును RTCకి జమ చేశారు. వాస్తవానికి డిపోలో నగదు పోయిన రోజు ఆయనకు వీక్లీ ఆఫ్ కావటంతో విధులకు వెళ్లలేదు.. అయినా బాధ్యుడిని చేశారు. నగదు మాయం వ్యవహారంలో ఇంటి దొంగల పాత్రపై డిపోలో విస్తృత చర్చ జరుగుతోంది.
భద్రతా విభాగంలోని ఓ ఉద్యోగి పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ విషయం పై కేసు నమోదు కాకుండా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి వద్ద పని చేసే ఉద్యోగి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. RTCలో నగదు వ్యవహారం చాలా పకడ్బందీగా జరుగుతుంది. డిపో క్లర్క్ తో పాటు భద్రతా సిబ్బంది వద్ద కూడా లాకర్ కీ ఉంటుంది. నగదు మాయమైన రోజున భద్రతా సిబ్బంది ఒకరు లాకర్ గదిలోకి వెళ్లి కాసేపు తలుపులు వేసుకున్నారని.. అప్పుడే డబ్బు మాయమైందని RTC ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. డబ్బులు రికవరీ చేయటంలో శ్రద్ధ చూపిన RTC ఉన్నతాధికారులు నగదు మాయం వ్యవహారంలో అసలు పాత్రదారులుఎవరో తేల్చటంపై దృష్టి సారించలేదు. విచారణ జరపకుండానే చిరుద్యోగిని బలి చేశారని విమర్శలు వస్తున్నాయి.