Atchenna on Chandrababu Security: జైలులో హత్య చేయడంలో 'జగన్ అండ్ కో' సిద్ధహస్తులు.. చంద్రబాబు భద్రతపై అచ్చెన్న ఆందోళన - Chandrababu Security in Rajamahendravaram Jail
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 4:00 PM IST
Atchenna on Chandrababu Security: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న వ్యక్తులను హత్య చేయడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, అతని బృందం సిద్ధహస్తులని అచ్చెన్న ఆరోపించారు. జైలులో ఉన్నవారిని నిశ్శబ్దంగా చంపిన ఘటనలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరి వల్ల తమకు ఆందోళన ఉందన్నారు.
జైలుపై డ్రోన్లు ఎగరేస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు విచారణం చేపట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబును హత్య చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని లేఖలు వచ్చినా.. విచారణ చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు లోపల నుంచి ఫొటోలు బయటకు వస్తున్నా.. ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. సజ్జల డైరెక్షన్లో మొత్తం వ్యవహరం నడుస్తుండడం వల్ల కూడా తమకు మరింత ఆందోళన కలుగుతోందన్నారు. గోరంట్ల మాధవ్ వంటి వారి మాటలతో ప్రభుత్వ ఉద్దేశాలు బయట పడుతున్నాయని పేర్కొన్నారు. స్కిల్ సెంటర్లు లేవని గతంలో మంత్రులు కామెంట్లు చేశారని గుర్తు చేశారు. స్కిల్ సెంటర్లు లేవని గతంలో కేసు పెట్టిన అజేయ్ రెడ్డే ఇప్పుడు స్వయంగా స్కిల్ సెంటర్లు ఉన్నాయని చెప్పారన్నారు.