ప్రభుత్వం స్పందించకుంటే సీఎం జగన్ నివాసాన్ని ముట్టడిస్తాం: అంగన్వాడీలు - ఏలూరులో అంగన్వాడీల సమ్మె
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 8:46 AM IST
Anganwadi Strike In Eight Day Resolve Their Demands: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఎనిమిదో రోజు వినూత్న రీతిలో కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నట్లు అంగన్వాడీలు తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. ఏలూరులోని ఫైర్ స్టేషన్ వద్ద అంగన్వాడీలు బిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా తహశీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వంటావార్పు నిర్వహించి సీఎం జగన్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రగిరిలో అంగన్వాడీల నిరసనకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది.
Anganwadi Strike In AP: వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు, కమలాపురం అలాగే ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద అంగన్వాడీలు వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమలలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం నేతలు మద్దతు పలికారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కార్యాలయం వద్ద వంటావార్పు నిర్వహించిన అంగన్వాడీలు తమ ఆందోళనలపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుండా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.