ముగ్గురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మైదుకూరుకు చెందిన అందాల రాముడు, మాచుపల్లె శ్రీనివాసులునాయుడు అలియాస్ డాన్ శీను, షేక్ అబ్దుల్ హకీం గత ఏడేళ్ల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు.
ఇప్పటి వరకు షేక్ హకీంపై 14 కేసులు, శ్రీనివాసులునాయుడుపై 16 కేసులు, అందాల రాముడిపై 14 కేసులు నమోదైనట్లు ఎస్పీ చెప్పారు. వీరికి తమిళనాడుకు చెందిన పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయన్నారు. అక్కడినుంచి కూలీలను తీసుకొచ్చి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లను నరికించి.. దుంగలుగా మార్చి అక్రమంగా రవాణా చేసి డబ్బులు సంపాదించుకునేవారని వెల్లడించారు. ముగ్గురిపై పీడీ యాక్టు నమోదుకు కలెక్టరు హరికిరణ్కు ప్రతిపాదనలు పంపగా అనుమతి ఇచ్చారన్నారు. వారిని అరెస్టు చేసి కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: 'సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్పై నిషేధం ఉంది'