కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లెలోని యురేనియం పరిశ్రమకు చెందిన టెయిల్పాండ్ కట్ట గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి కోతకు గురైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు కోతకు గురైన ప్రాంతాన్ని యంత్రాల సాయంతో పూడ్చేశారు. యురేనియం పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను నిల్వ చేసేందుకు కొట్టాల గ్రామ సమీపంలోని ఎర్రవంక వాగు వద్ద టెయిల్పాండ్ నిర్మించారు. ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యర్థాలు నిల్వ లేకుండా చేసేందుకు పాండ్ను ఏటవాలుగా నిర్మిస్తున్నారు. ఈలోపు కొండ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో నీరు స్పిల్వే వద్దకు చేరుకుని, కట్ట కోతకు గురైంది. దీంతో వ్యర్థాలతో కూడిన నీరు కిందభాగంలో ఉన్న సంపుల్లోకి వెళ్లింది. నష్టం జరగకుండా చూసేందుకు శుక్రవారం నుంచి పరిశ్రమలో ముడి ఖనిజం శుద్ధి పనులను నిలిపివేశారు.
విషయం తెలుసుకున్న స్థానిక రైతులు శుక్రవారం టెయిల్పాండ్ను సందర్శించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రెండు నెలల క్రితం భారీ వర్షానికి సంపుల్లోని వ్యర్థాలతో కూడిన నీరు పొంగి పొలాల్లోకి వెళ్లడంతో పంటలు దెబ్బతిన్నాయి. తాజాగా టెయిల్పాండ్ కట్ట కోతకు గురికావడంతో స్థానిక రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం శనివారం పాండ్ వద్ద ఆందోళన చేయాలని రైతులు నిర్ణయించారు. ‘గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విస్తరణ కోసం చేపట్టిన బెండ్ నుంచి నీరు మూలకు చేరి టెయిల్పాండ్ కట్ట స్వల్పంగా కోతకు గురైంది. ఎలాంటి నష్టం జరగలేదు’ అని యురేనియం పరిశ్రమ జీఎం ఎం.ఎస్.రావు తెలిపారు.
ఇదీ చూడండి: HIGH COURT: తల్లుల ఖాతాల్లో బోధన రుసుములా!