మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం గేటు ఎదుట ధర్నా చేశారు.
కరోనా ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై పన్నుల భారం మోపటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవోలను రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. తణుకు మున్సిపల్ కమిషనర్ వాసు బాబుకు తెదేపా నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ పరిమి వెంకన్నబాబు, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ ఛైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏలూరులో వింత వ్యాధి తగ్గుముఖం.. రాత్రి నుంచి ఒకే ఒక్క కేసు నమోదు