పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల, గుండుగొలను, భీమడోలు గ్రామాల్లో 34 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తర్వాత 31 మంది కోలుకొని ఇళ్ల వెళ్లగా.. ముగ్గురు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల రక్తం నమూనాలు, కోడిమాంసం, కూరగాయల నమూనాలను సేకరించి హైదరాబాద్ పంపించారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పీహెచ్సీని సందర్శించారు. కొత్త కేసులు ఏమైనా వచ్చాయా, బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. గురువారం పలువురు పూళ్ల పీహెచ్సీకి రావడంతో సిబ్బంది కంగారుపడ్డారు. పరీక్షలు చేయగా సాధారణ అనారోగ్యమని తేలింది. వీరిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు ఉన్నారు.
పూళ్లలో ఎంటమాలజికల్ సర్వే బృందం గురువారం పర్యటించింది. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, నివాస ప్రాంతాల్లో నీటి నిల్వలు, దోమల లార్వాల గుర్తింపు తదితర అంశాలను పరిశీలించారు. ఎంపీహెచ్ఈవో రవిశేఖర్, లక్ష్మి, సతీష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గాయాలయ్యాయి
ఇంట్లో వంట చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోవడంతో ముఖంపై గాయాలయ్యా యి. పీహెచ్సీలో వైద్యం చేయించుకున్నా. కొంచెం పర్వాలేదు. కానీ ఇంకా తగ్గలేదు. మందులు ఇచ్చారు. -విప్పర్తి భూషమ్మ
నిద్రలో నాలుక కరుచుకున్నా
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్రలో ఉండగా నాలుక కరుచుకున్నా. కళ్లు తిరిగి పడిపోయాను. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. అప్పుడు కొంత కుదుటపడ్డాను. ఉదయం ఆసుపత్రికి వెళ్లగా బీపీ చూశారు. సెలైన్ పెట్టి మందులు ఇచ్చారు. కొంచెం నీరసంగా ఉంది. - బుంగా సీమోను
వాంతులు అయ్యాయి
నేను పూళ్లలో ఉంటున్నాను. మంగళవారం ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయా. ఏమి తిన్నా వాంతులయ్యాయి. మా మావయ్య ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చారు. ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. - రామకృష్ణ, పూళ్ల
వాలీబాల్ ఆట చూస్తూ మూర్ఛపోయా
పడమర హరిజనపేటలో ఉంటాను. కూలి పనులకు వెళ్తుంటాను. 18వ తేదీన మా ఇంటి సమీపంలో పలువురు యువకులు వాలీబాల్ ఆడుతున్నారు. చూడటానికి వెళ్లాను. ఉన్నట్టుండి మూర్ఛ వచ్చి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం కోలుకున్నాక ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం నీరసం, నొప్పులు ఉన్నాయి. - గోడి కృష్ణ
ఇదీ చదవండి: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ఎనిమిది మంది మృతి