![tdp leader nimmala ramanaidu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6627295_letter.png)
కరోనా, లాక్డౌన్ ప్రభావంతో ఆక్వా రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ముఖ్యమంత్రి జగన్కు బుధవారం లేఖ రాశారు. మొన్నటి వరకు అక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని చవిచూడాల్సి వచ్చిందని వివరించారు. కిలో కూరగాయల కంటే కూడా కిలో రొయ్యలు తక్కువ ధర పలుకుతున్నాయని వివరించారు. ప్రభుత్వం చెప్పే ధరలకు, రైతులకు అందుతున్న ధరలకు అసలు సంబంధమే లేకుండా పోతోందని లేఖలో పేర్కొన్నారు. ఫలితంగా ఒక్కో ఎకరాకు రైతుకు కనీసం 30 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని వివరించారు. ఐకేపీ ధాన్యం కొనుగోళ్ల మాదిరిగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా నేరుగా రైతుల నుండి ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యాన్ని తగిన విధంగా ఉపయోగించుకుంటే.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులన్నింటినీ నిల్వ చేసుకోవచ్చని సూచించారు. రైతులకు ఉపయోగపడేలా ఆర్థిక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలన్నారు. తన నియోజకవర్గంలో నిర్వహించిన మరో కార్యక్రమంలో పాలకొల్లు మున్సిపాలిటీ 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా అభివృద్ధిలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ రామానాయుడు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 111కు కరోనా కేసులు... బాధితుల్లో అత్యధికులకు దిల్లీ లింకు