రబీలో నీటి తడులు అందక పశ్చిమగోదావరి జిల్లాలో వరిపొలాలు ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రలుచాచి..దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. గోదావరిలో నానాటికీ పడిపోతున్న నీటిమట్టాలతో పంట పొలాలు తడారిపోయాయి. ఎగువ తూములు రాత్రికి రాత్రే ఎత్తేయటం వల్ల..దిగువకు నీరు రావటం లేదు. శివారు కాలువలకు వచ్చేసరికి కాలువల్లో నీరు కనిపించటం లేదు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఈసారి రబీసాగు చేపట్టారు. మెుత్తం 4.60 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దీంతో పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
వంతుల వారీగా విడుదల
గోదావరిలో నీటిమట్టం తగ్గటంతో కాలువలకు నీటి పంపిణీ తగ్గించారు. వంతులవారి విధానం అమలు చేపట్టారు. పశ్చిమగోదావరి డెల్టాకు ప్రస్తుతం 3,840 వేల క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తున్నారు. ఇందులో ఏలూరు కాలువకు 618, జీవీ కాలువకు 450 క్యూసెక్కులు, నరసాపురం 1312, ఉండి 937, అత్తిలి 239 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆయా కాలువలకు వంతుల వారీగా విడుదల చేస్తున్న నీరు.. శివారు భూములకు చేరటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి వంతుగా 2.29 లక్షల ఎకరాలకు, రెండో వంతుగా 2.22 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. ప్రధాన కాలువలకు నీటి విడుదల చేసి..ఉప కాలువలకు వంతుల విధానం అమలు చేస్తున్నారు.
అధికారుల అక్రమాలు..
స్లూయిజ్, షట్టర్లను నిబంధనలకు విరుద్ధంగా తెరిచి...ఆక్వా చెరువులకు నీటిని మళ్లిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే జలచౌర్యానికి పాల్పడుతున్నారని వాపోతున్నారు. జిల్లాలో లష్కర్లు ఎకరాకు వేయి నుంచి రెండు వేల రూపాయల వరకు మామూళ్లు అందుకొని ఆక్వా చెరువులకు నీటిని దొంగచాటుగా మళ్లిస్తున్నారన్నారు. ఆక్వా చెరువులకు నీరందించటం వల్ల..శివారు భూములకు నీరు పారటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకివీడు, ఉండి, దెందలూరు, భీమడోలు, అత్తిలి ప్రాంతాల్లో శివారు వరిపొలాలు నీరందక ఇప్పటికే పంట దెబ్బతింది. ప్రధాన కాలువల్లో నీటిమట్టం పడిపోవడం వల్ల..డీజిల్ ఇంజన్ల సాయంతో నీటిని తోడుకొంటున్నారు.
అధికారులు జలచౌర్యం జరగకుండా నియంత్రించి..మెరక, శివారు పొలాలకు నీరందించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీచదవండి
కృష్ణాతీరంలో చమురు తవ్వకాలు..ముప్పు తప్పదంటున్న పర్యావరణవేత్తలు