పశ్చిమగోదావరి జిల్లా కె.ఆర్.పురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) ఆర్వీ సూర్యనారాయణను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ పీవో తనను లైంగికంగా వేధించారని ఓ గిరిజన యువతి ఆరోపణలు చేయడంతో స్పందించిన కలెక్టర్ ఈ మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఆయన స్థానంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మిని ఇన్ఛార్జిగా నియమించగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అలాగే మెజిస్టీరియల్ విచారణ నిర్వహించే బాధ్యతలను ఏలూరు ఆర్డీవో పి.రచనకు కలెక్టర్ కార్తికేయ మిశ్రా అప్పగించారు.
యువతి ఫిర్యాదుపై విచారణ
మరో పక్క పీవోపై అభియోగాలు మోపిన యువతి మరో వాట్సప్ వీడియోలో భిన్నమైన కథనం వినిపించడం చర్చనీయాంశమైంది. పోస్టింగ్ పెడితే ఉద్యోగం వస్తుందంటూ ఇద్దరు వ్యక్తులు తనను ప్రేరేపించారని, తన వ్యక్తిగత వీడియోలు కొన్ని తమవద్ద ఉన్నాయంటూ వారు తనను బెదిరించి వీడియో తీయించి వాట్సప్లో పంపేలా చేశారని వివరించింది. పీవోపై తాను చేసిన అభియోగాలు వాస్తవం కాదని అందులో ఆమె వెల్లడించడం గమనార్హం. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలవరం డీఎస్పీ లతాకుమారి, సీఐ మూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చదవండి:
MP Raghurama: వైకాపా వెబ్సైట్ నుంచి ఎంపీ రఘురామ పేరు తొలగింపు