విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఆర్. వసంత గ్రామానికి చెందిన దంపతులు దమరసింగి రాము, సన్యాసమ్మల సంతానం గణేష్, రేవతి. వీరిద్దరూ స్థానిక ప్రభుత్వ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. తొలుత సరదాగా నేర్చుకున్న ఈతను.. క్రీడగా మార్చుకున్నాడు గణేశ్. అందులో పూర్తి స్థాయిలో విజయం దక్కలేదు. అనంతరం మిత్రుల ప్రోత్సహంతో వారి సైకిల్పై.. సైక్లింగ్ను ప్రాక్టీస్ట్ చేశాడు. మెుదట జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవటంతో.. 2018లో గుంటూరు, గన్నవరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. అందులో బంగారం, కాంస్య పతకాలు సాధించాడు. మరింత ఉన్నత శిక్షణ కోసం అకాడమీలో చేరాడు. ఆ సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో గణేశ్కు కాలు విరిగింది. వైద్యులు భవిష్యత్తులో సైకిల్ తొక్కవద్దన్నా వినకుండా.. గాయం మానిన వెంటనే తిరిగి సన్నద్ధం అయి జాతీయ స్థాయిలో పోటీలకు అర్హత సాధించాడు. ఇటీవల పుణేలో జరిగిన అండర్-19 జాతీయస్థాయి పోటీల్లో ఏడో స్థానంలో నిలిచాడు.
దాతల కోసం...
ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న గణేశ్కు సైక్లింగ్ పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉన్నా.. తగిన ప్రోత్సాహం లేకపోవటం వెలితిగా మారింది. ఇప్పటివరకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, గ్రామస్థులు అందిస్తున్న సహాయ, సహకారాలతో నెట్టుకొస్తున్నాడు. పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన రవాణా, ఇతర ఖర్చుల కోసమూ దాతలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. గణేశ్కి గ్రామానికి చెందిన ఉద్యోగులు, యువకులు కలసి సైకిల్ కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించారు. అప్పటినుంచి సొంత సైకిల్పై ప్రాక్టీస్ చేసే అవకాశం కలిగింది. జాతీయ పోటీల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో పోల్చితే.. ఏపీ క్రీడాకారులకు అందుతున్న ప్రోత్సాహం నామమాత్రమే అంటున్నాడు గణేశ్. ప్రభుత్వం నుంచి తగిన సహాయ, సహకారాలు అందిస్తే.. సైక్లింగ్ పోటీల్లో రాష్ట్రానికి పేరు, ప్రఖ్యాతలు సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.
అన్నే ఆదర్శం..
గణేష్ చెల్లెలు.. రేవతి కూడా అన్న బాటలో నడుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇంటర్మీడియట్ చదువుతూ సైకిల్ రైసులో పాల్గొంటోంది. 2019లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆమె రజత, కాంస్య పతకాలు సాధించింది. అప్పట్లో వరల్డ్ విజన్ సంస్థ ఆమెను అభినందిస్తూ 60వేల రూపాయల విలువైన సైకిల్ బహుకరించింది. ఆమె జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షిస్తోంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తగిన శిక్షణ తీసుకొలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆర్థిక స్థోమత లేకపోయినా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్న అన్నాచెల్లెలు గణేష్, రేవతిలను ఆర్.వసంత గ్రామస్థులు అభినందిస్తున్నారు. ప్రభుత్వం తగిన ప్రోత్సహం అందిస్తే.. క్రీడాపరంగా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఇదీ చదవండీ.. ముగిసిన 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు