కొండలనే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. వారి బంగారు బతుకులకు వారే చక్కటి బాటలు వేసుకుంటున్నారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని చూడకుండా సంఘటితమై ఏళ్లుగా ఉన్న సమస్యను ఓ దారికి తీసుకొచ్చారు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని దిగువరూఢి నుంచి మైదాన ప్రాంతం బట్టివలసకు మూడేళ్ల క్రితం రూ.20 లక్షలతో మూడు కిలోమీటర్ల మేర ఐటీడీఏ మట్టి రోడ్డును ఏర్పాటు చేసింది. తర్వాత పడిన వర్షాలకు అది కొట్టుకుపోయింది. అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో దిగువరూఢితో పాటు డెన్సరాయి, ఎగువరూఢి, గాలిపాడు గ్రామాల ప్రజలు ఏకమయ్యారు.నాలుగు ఊళ్లలోని 77 కుటుంబాలు ఒక్కో ఇంటి నుంచి రూ.10 వేలు చొప్పున సేకరించి యంత్రాలను సమకూర్చారు. వీటితో డెన్సరాయి నుంచి బట్టివలసకు 8 కిలోమీటర్ల పొడవున వెడల్పాటి మట్టి రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తవగా కల్వర్టుల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. గతేడాది కొదమ, చింతామల ప్రజలు రోడ్లు వేసుకోవడంపై సోనూసూద్ స్పందించడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డారు ఇక్కడి గిరిజనులు.
ఇదీ చదవండి: ఇసుక అక్రమార్కులకు 22.50 కోట్ల జరిమానా