ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై విజయనగరం జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ కార్యాలయాల ముందు ధర్నాలు, రహదారులపై రాస్తోరోకోలు చేపట్టారు. గరుగుబిల్లి మండలం దత్తివలస వద్ద పార్వతీపురం-శ్రీకాకుళం రహదారిపై అన్నదాతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం రైతులు ఉరి తాళ్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలి వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ.. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
కలెక్టర్కు వినతిపత్రం..
ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని సీతానగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. బలిజిపేటలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతూ... రైతుసంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు రాస్తారోకో చేపట్టారు. పలువురు రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వం ప్రకటిస్తున్నట్లు జిల్లాలో ఆర్బీకే. కేంద్రాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు జరగటం లేదు. దళారులు, మిల్లర్లను ఆశ్రయించి, ఎకరానికి రూ.7నుంచి రూ.8వేల వరకు నష్టపోతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలి. - ధాన్యం రైతుల ఆవేదన
ఆందోళన చెందవద్దు..
అన్నదాతల ఆందోళనలపై కలెక్టర్ సూర్యకుమారి స్పందించారు. నూర్పు నూర్చి, సిద్ధంగా ఉన్న రైతుల నుంచి ధాన్యాన్ని కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలకూ ధాన్యాన్ని పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. మిల్లర్లతో మాట్లాడి వెంటనే లిఫ్టింగ్ చేయాలనీ ఆదేశించామని, గన్నీ సంచులనూ సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ వస్తే రైతులు బయట అమ్ముకోవచ్చునని కలెక్టర్ వెల్లడించారు.
ఇవీచదవండి :