స్టైరీన్ లీకేజీ ఘటన జరిగి వారం రోజులు పూర్తైనా పరిసర గ్రామాల ప్రజలను ప్రమాద భయం వీడటం లేదు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రజలు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు. కొంత మంది గ్రామాలకు చేరుకున్నా ఇళ్లను శుభ్రం చేసుకుని పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రజల్లో భయం పోగొట్టేందుకు అటు జీవీఎంసీ అధికారులు, ఎల్జీ పరిశ్రమ సిబ్బంది కృషి చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు పరిశ్రమ పరిసర గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి నివాసయోగ్యంగా మార్చేందుకు శ్రమిస్తున్నారు.
విషవాయు ప్రభావం వల్ల ఎండిపోయిన చెట్లను తొలగించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లారు. సోడియం ద్రావణాన్ని పిచికారీ చేశారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేశారు. గ్రామస్తులకు ఫినాయిల్, లైజాల్ ఉచితంగా అందజేశారు. మరికొన్ని రోజుల పాటు గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ కూడా స్థానికులకు భోజన వసతి కల్పించడంతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ను పూర్తిగా తరలించినట్లు పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో భారతీయ జనతా యువ మోర్ఛా బృందం పర్యటించింది. ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని బాధితులకు వెంటనే అందించాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువులు అందించి ఆదుకోవాలని కోరారు. బాధిత గ్రామాల్లో ప్రభుత్వ సహాయ చర్యల పట్ల తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకటి రెండ్రోజుల్లో బాధిత గ్రామాల్లోకి వెళ్లి తీరతామన్నారు.
జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం పరిశ్రమను పరిశీలించింది. మూడు గంటల పాటు పరిశ్రమలోనే గడిపి... ప్రమాదం జరిగిన తీరు, వాయువు లీక్ అవడం వంటి అంశాలపై విచారణ చేసింది. ఎల్జీ సంస్థ ప్రతినిధుల బృందం ట్రిబ్యునల్ను కలిసి ప్రమాద వివరాలు అందించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఎల్జీ పాలిమర్స్ సంస్థ 50 కోట్ల రూపాయలను జిల్లా కలెక్టర్ పేరును జమ చేసింది. అదే సమయంలో విశాఖలోని పలు సంస్థలు ట్రిబ్యునల్ను కలిసి తమ అర్జీలు అందజేశారు.
పరిశ్రమ ఎదుట గ్రామస్తుల నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనూ, పరిశ్రమ గేట్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు గస్తీ నిర్వహించారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్య బృందం పరిశ్రమకు వచ్చే సమయంలో రహదారులపై పూర్తి ఉన్నత శ్రేణి కాన్వాయ్ భద్రత కల్పిస్తున్నారు.
విశాఖ ఎల్డీ పాలిమర్స్ ఘటనలో ఆసుపత్రి పాలైన చిన్నారులను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు డీజీపీ మనోధైర్యాన్నిచ్చారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
ఇవీ చదవండి