గతనెల 30న పోలీసుల కాల్పుల్లో చనిపోయిన గిరిజనుడికి మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని... ఎంకెవిబి డివిజనల్ కమిటి కార్యదర్శి కైలాసం ఓ ఆడియోటేపు విడుదల చేశారు. గతనెల 30న మల్కన్గిరి జిల్లా మడకపొదర్ పంచాయతీ గొడబెడ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో... ఏం తెలియని గిరిజనుడిని కాల్చి చంపి... మావోయిస్టు ముద్ర వేశారని ఆరోపించారు. ఆరోజు రాత్రి 8 గంటల సమయంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు.
ఆ సమయంలో పార్టీ వారంత తప్పించుకోగా ఆమాయక గిరిజనుడ్ని కాల్చి చంపారని కైలాసం ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతనెల 16న డకోడ్పొదర్ వద్ద చేపలు పట్టడానికి వెళ్లిన రాజును పోలీసులు తీసుకెళ్లారని... నేటికి ఆ యువకుడి జాడలేదన్నారు. బోండా ఘాట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీఏస్ఎఫ్ క్యాంపు కారణంగా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆరోపించారు.
విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టడానికే అభివృద్ధి పేరుతో రహదారులు నిర్మిస్తున్నారని కైలాసం పేర్కొన్నారు. కోరాపుట్, మల్కన్గిరి జిల్లాలో వరుస కూంబింగ్లతో గిరిజనులను భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని కోరారు.
ఇదీ చదవండి...