ఆంధ్రా-ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ను కలుపుతూ ఉండే ఘాట్ రోడ్... ప్రస్తుతం దోపిడీ దొంగల భయంతో వణుకుతోంది. ఆ దారి గుండా ప్రయాణం చేయాలంటే వాహనదారులు హడలిపోతున్నారు. విశాఖ జిల్లా సీలేరు నుంచి గూడెంకొత్తవీధి వరకు 49 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల.. ప్రయాణం చేయాలంటే సాహసించాల్సిందే. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అడవి జంతువులు ఎక్కువగా ఉండటం వల్ల.. అంతగా ఎవరూ ప్రయాణించేవారు కాదు. కాలక్రమేణా వాటి సంచారం తగ్గడంతో రాకపోకలు పెరిగాయి.
దారి దోపిడీ దొంగలు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. వాహనాలను అడ్డగించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నెలలోనే నాలుగైదు పర్యాటక వాహనాలపై దాడి చేసి.. వారి నుంచి నగదు, బంగారం కాజేశారు.
దోపిడీలకు పాల్పడుతున్నవారు ఎక్కడి వారు? ఎవరనేది? పోలీసులకు అంతుచిక్కడం లేదు. వారు ఒరియా, హిందీలో మాట్లాడుతుండటంతో స్థానికులు కాదని భావిస్తున్నారు. అయితే ఇక్కడి వారి సాయంతోనే దోపిడీలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు.
ఈ రహదారిలో వరుస ఘటనలు.. ఆందోళనలకు గురి చేస్తున్నాయని.. త్వరగా దోపిడీ ముఠాను అరెస్ట్ చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.