కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో విశాఖ వాల్తేర్ డివిజన్.. నిత్యావసరాల రవాణా కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని నిరంతరాయంగా కొనసాగించాలని తూర్పు కోస్తా రైల్వే నిర్ణయించింది.
రైలు నెంబర్ 00530 విశాఖ సంబల్ పూర్ పార్శిల్ ఎక్స్ప్రెస్ను ఈనెల 17 నుంచి 31 వరకు రోజు విడిచి రోజు నడపనున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖలో బయలుదేరి సాయంత్రం 5.30కు సంబల్ పూర్ ఈ పార్శిల్ రైలు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 00529 ఈనెల 18 నుంచి రోజు విడిచి రోజు ఇదే తరహాలో నడుస్తుందని రైల్వే వర్గాలు వివరించాయి. ఈ రైళ్లు విజయగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగుడ, కిసింగ, టిట్లాఘర్, బలంగీర్, బార్గా రోడ్ స్టేషన్లలో ఆగుతాయి.
మరో రైలు నెంబర్ 00532 విశాఖ - కటక్లమధ్య ఈనెల 16 నుంచి 31 తేదీల మధ్య రోజు విడిచి రోజు నడుస్తుంది. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరే రైలు సాయంత్రం 6.30 గంటలకు కటక్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలుని నెంబర్ 00531 కటక్ నుంచి విశాఖకు 17 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు రోజు విడిచి రోజు నడుపుతారు. ఉదయం 9 గంటలకు కటక్లో బయలుదేరే ఈ రైలు సాయంత్రం 5.30 కు విశాఖ చేరుతుంది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్ఛాపురం, బ్రహ్మపురం, ఛత్రపూర్, బలుగాం, ఖుర్దారోడ్, భువనేశ్వర్ స్టేషన్లలో ఈ పార్శిల్ రైలు ఆగుతుంది. నిత్యవసర వస్తువులు, మందుల రవాణాకు ఈ పార్శిల్ రైళ్లను వినియోగించుకోవాలని వాల్తేర్ డివిజనల్ సీనియర్ డీసీఎం సునీల్ కుమార్ కోరారు. పార్శిల్ రవాణా కోసం సంబంధిత స్టేషన్ మేనేజర్లను సంప్రదించాలని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు