రాజధాని అమరావతిపై పురుపాలకమంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వ్యాఖ్యలు చేశారు. అమరావతి అందరిదీ.. అని.. కేవలం ఓ సామాజిక వర్గానికి చెందినది కాదన్న విషయాన్ని ప్రతిపక్షం గుర్తించాలన్నారు. అమరావతిపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఏ విషయంలో క్లారిటీ కావాలని ప్రశ్నించారు. రాజధాని అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని.. ఈ విషయంలో ప్రజలందరికీ స్పష్టత ఉందని, క్లారిటీ లేనిది తండ్రీ కొడుకులకే అని ఎద్దేవా చేశారు.
అమరావతిలో దోపిడీ నిజం కాదా..?
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వ్యక్తిగత ఆరాధన కోసం వ్యవస్థలు ఛిన్నాభిన్నం చేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అమరావతిలో కేవలం ఒకే ఒక్క శాశ్వత కట్టడాన్ని నిర్మించి.. చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో చంద్రబాబు బంధువులు, నేతలు దోచుకొన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. బాబు..లోకేష్ల బాధ కేవలం తమ వియ్యంకులు, బంధువుల కోసమేనన్నారు.
సీఎంపై అలాంటి వ్యాఖ్యలా...?
ఓటమి బాధలో చంద్రబాబు నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని సంబోధించే తీరు అదేనా అని మండిపడ్డారు. బాబు ఆలోచనలు, మోసం, దగా గమనించే ప్రజలు ఓడించారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు వున్నా ఇచ్చిన హామీలను జగన్ నెరవేరుస్తున్నారని, వ్యవస్థలను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఇదీ చూడండి:'రాష్ట్ర దారుణ పరిస్థితికి... గత ప్రభుత్వమే కారణం'