విశాఖ సృష్టి ఆస్పత్రికి వివిధ ప్రధాన నగరాల్లో ఉన్న శాఖలు ఈ ఆస్పత్రి ద్వారా టెస్ట్ ట్యూబ్ పద్ధతి, మిగిలిన పద్ధతుల ద్వారా.. కృత్రిమ గర్భ ధారణలు, అద్దెగర్భం వంటి వాటి ద్వారా పసి గుడ్డులును తయారు చేస్తున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వేరే వ్యక్తులకు అప్పగించి వారినే తల్లిదండ్రులుగా రికార్డులలో చూపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు వైద్యులను, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కన్ను తెరవని ఒక్క పసికందు విక్రయంలోనే దాదాపు 13 లక్షల పైగా డబ్బులు చేతులు మారినట్లు విచారణలో తేలింది. దీని ఆధారంగా పోలీసులు మరిన్ని వాస్తవాలు వెలికి తీసే పనిలో ఉన్నారు.
గ్రామీణ నిరక్షరాస్య పేద మహిళలను ఎంపిక చేసుకుని.. వారికి పెద్ద ఆస్పత్రిలో ఉచిత కాన్పు ఆశను చూపించి ఈ రకంగా పసిగుడ్డుల విక్రయాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆస్పత్రులలో ఈ తరహా శిశువులకు సంబంధించిన రికార్డులు స్పష్టంగా లేకుండా జాగ్రత్త పడతారు. ఈ క్రమంలో డెలివరీ, నియోనేటల్ వంటి సహాయాలను తీసుకునే ఆస్పత్రులలో పూర్తి వివరాలు వైద్యులకు కూడా తెలియకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు తెలియకుండానే ఈ వలయంలో చిక్కుకోవడాన్ని పోలీసులు గుర్తించారు. సృష్టి ఆస్పత్రి పర్యవేక్షణలోనే 2017 నుంచి ఇప్పటివరకు 63 సరోగసి కాన్పులు జరిగినట్టుగా రికార్డులు లభించాయి. వీటి వివరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారించనున్నారు.
గత కొంత కాలంగా వివిధ పోలీసు స్టేషన్లలో ఈ తరహా ఫిర్యాదులు నమోదైనట్లు నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. దీనిపై లోతుగా విచారిస్తామని చెప్పడంతో.. ఎవరెవరు ఇందులో ఉన్నారనే అంశం ఆసక్తి రేపుతోంది.
ఇదీ చదవండి: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి